మినిస్టర్ ధర్మేంద్ర దుగ్గిరాల ఇంటికి వచ్చి ఈరోజు మీ కార్లకు యాక్సిడెంట్ జరగడానికి, తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణం మీ అబ్బాయి రాజ్, మీ కోడలు కావ్యలే కారణమని చెప్తాడు. దీంతో రాజ్ ఆవేశంగా మినిస్టర్ కాలర్ పట్టుకుంటాడు. చేసిందంతా చేసి నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నా ఫ్యామిలీని చంపాలని చూస్తావా? నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడతావా అంటూ కోప్పడతాడు. దీంతో ధర్మేంద్ర ఈ ఆవేశమే మిమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చింది. మీ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది అని చెప్పగానే.. సుభాష్ వచ్చి ఎవరు ఈయన? మినిస్టర్ అంటున్నాడు? మన మీద ఇంత కక్ష ఏంటీ? అని సుభాష్ అడుగుతాడు.
మీవాడు చెప్పలేకపోతున్నాడు.. నేనే చెబుతాను. మీకు నాకు ఎలాంటి శతృత్వం లేదు.. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ మీ కొడుకు, కోడలు నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. నేను ఊరుకుంటానా? అందుకే నేను మీ ఫ్యామిలీ జోలికి, మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఏం జరిగిందో మీ అబ్బాయి చెబుతాడు.. అదంతా విన్న తర్వాత నాలాంటి వాడి జోలికి, నా ఫ్యామిలీ జోలికి రావొద్దని చెప్పండి అందరూ బతికిపోతారు. కాదు.. కూడదు అని మళ్లీ నా ఇంటి వైపు చూస్తే నేను మళ్లీ మీ ఇంటికి రావాల్సి వస్తుంది. కానీ ఈసారి మీతో చర్చించడానికో, మీకు వివరణ ఇవ్వడానికో కాదు… మీ అందరి ఫోటోలకు దండలు వేయడానికి వస్తాను అంటూ ధర్మేంద్ర వార్నింగ్ ఇవ్వగానే.. కావ్య, రాజ్ కోపంగా తిడతారు. నీ బెదిరింపులకు మేం భయపడమని కావ్య చెప్తుంది.
దీంతో ధర్మేంద్ర కుర్రోళ్లకు ఏం అర్ధం కావడం లేదు. నేనంటే ఏంటో చూసి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు.. మీరే నచ్చజెప్పండి.. నా జోలికి వస్తే మీ ఇంట్లో ఎవ్వరూ మిగలరు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ధర్మేంద్ర. మినిస్టర్ వెళ్లిపోయాక ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. వాడి జోలికి ఎందుకు వెళ్లారు అంటూ ప్రకాష్, ధాన్యలక్ష్మీ అడుగుతారు. దీంతో రాజ్ నిజం చెప్పబోతుంటే.. వద్దని వారించిన కావ్య బిజినెస్ లో గొడవలు ఇంతదాకా వస్తాయనుకోలేదు.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కావ్య చెప్తుంది. మరోవైపు మినిస్టర్, రుద్రాణి పార్టీ చేసుకుంటారు. మినిస్టర్ రుద్రాణిని పొగుడుతుంటాడు. నువ్వు మామూలు మహిళవి కాదు.. మహా అరుదైన మహిళవి.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే నన్నే మించిపోతావు అని పొగడతాడు. దీంతో రుద్రాణి నాకు అలాంటి ఆశలు లేవు.. కేవలం పగ మాత్రమే ఉంది. నేను వర్కవుట్ అయ్యే ఐడియా మాత్రమే ఇచ్చాను.. నీ భార్య కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉండకూడదు అన్నారు, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కావ్య, రాజ్లు ఇకపై మీ ఇంటి గురించి, మీ గురించి ఆలోచింరు అని చెప్తుంది రుద్రాణి..
దీంతో ధర్మేంద్ర నువ్వు చెప్పినట్లు ఆ ఫ్యామిలీ కళ్లలో చావు కనిపించింది. ఆ రాజ్, కావ్యల కళ్లలో భయం చూశాను అంటాడు. దీంతో రుద్రాణి ఆ కుటుంబంలో ఉన్నవాళ్లంతా సెంటిమెంటల్ ఫూల్స్.. ఎవరి కోసం వాళ్లు బతకరు, పక్కవాళ్లకి కన్నీళ్లు రావొద్దని బతుకుతారు అని చెప్పగానే.. ధర్మేంద్ర కూడా నా వెనకుండి నన్ను బాగా నడిపిస్తున్నావు.. నీ రుణం తీర్చుకునే అవకాశం మాత్రం నాకు ఇవ్వడం లేదు అని రుద్రాణిని అడుగుతాడు. రుద్రాణి ఆ సందర్భం ముందుంది.. ఆ ఇంట్లో ప్రళయం, నా కొడుక్కి పట్టాభిషేకం.. ఒకేసారి జరగాలి. అప్పుడే కలిసి మళ్లీ పార్టీ చేసుకుందాం అంటుంది. మరోవైపు రాజ్ కోపంతో రగిలిపోతూ.. మినిస్టర్ ను డైరెక్టుగా ఎదుర్కోలేమని కావ్యతో చెప్తాడు. అయితే కావ్య ఒక ప్లాన్ చెప్తుంది. ప్లాన్ బాగుందని వెంటనే ఫాలో అవుదామని చెప్తాడు రాజ్.
మరుసటి రోజు తులసి కనిపించకపోవడంతో మినిస్టర్ కంగారు పడతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా..? అంటాడు. నీ భార్యను డాక్టర్ చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్లి నిజం చెప్తానని రాజ్ చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. నిజం చెప్పొద్దని రాజ్ను బతిమాలుతాడు.. తర్వాత కారు వేసకుని మినిస్టర్ ఎక్కడికో వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య దగ్గరకు వెళ్లిన తులసి ఇంత ఉదయమే నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడగుతుంది. మీకు పాలు పడటం లేదని చెప్పారు కదా? నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఇక్కడికి వస్తున్నారు, ఆయనతో మీకు మెడిసిన్ ఇప్పిద్దామని పిలిచాను అని చెప్తుంది కావ్య.. దీంతో మీరు ప్రతిసారి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు.. కానీ నేను మీకు ఏం చేయలేకపోతున్నాను అంటుంది తులసి. ఏదో ఒక రోజు మీరు సాయం చేయాల్సిన రోజు వస్తుంది.. ఆ రోజు కాదనకుండా సాయం చేయమని అంటుంది కావ్య. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.