పిల్లలు స్కూల్కు వెళ్లడానికి రెడీ అవుతుంటే.. మనోహరి, చంభాను తీసుకుని రూం దగ్గరకు వెళ్తుంది. చంభా చేతిలో మంత్రదండం ఉంటుంది. వెళ్లు చంభా రూంలోకి వెళ్లి నీ మంత్రదండం ఉపయోగించి ఎవరికి దైవశక్తి ఆవహించిందో తెలుసుకో అని చెప్తుంది. దీంతో చంభా రూంలోకి వెళ్లి పిల్లుల రెడీ అవుతున్నారా..? అని అడుగుతుంది. దీంతో అంజు వెటకారంగా లేదు సర్కస్ చేస్తున్నాము అని చెప్తుంది. దీంతో చంభా నువ్వు భలే జోక్ చేస్తావు అంజు అంటుంది. దీంతో అంజు చంభా చేతిలో మంత్రదండం చూసి ఏంటి యాదమ్మ అది వెరైటీగా ఉంది.. ఏదీ ఒకసారి చూడనివ్వు అని అడుగుతుంది. దీంతో చంభా తన మంత్రదండాన్ని అంజు చేతికి ఇస్తుంది. అంజు తీసుకుని చూస్తుంటే.. మిగతా ముగ్గురు పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో చంభా.. అంజు పాప ఇది నా కోసం తెచ్చుకున్నాను. కింద కూర్చున్నప్పుడు పైకి లేవాలంటే ఇబ్బందిగా ఉంది కదా..? అందుకే తెచ్చుకున్నాను అని చెప్పగానే.. ఆనంద్ ఆశ్చర్యంగా ఓహో పైకి నుంచోవడానికి దీన్ని తెచ్చుకున్నారా..? అంటాడు.
చంభా అవును బాబు.. కావాలంటే నువ్వు కూడా దీన్ని పట్టుకుని చూడొచ్చు అంటూ తీసుకెళ్లి మంత్రదండాన్ని ఆనంద్ కు ఇస్తుంది. ఇంతలో ఆకాష్ ఇదేదో పాతకాలం మనుషులు వాడే ఊతకర్రలా ఉందే..? అంటాడు. దీంతో చంభా అలాంటిదే బాబు అనగానే.. మరీ ఇంత చిన్నది తెచ్చుకున్నావేంటి యాదమ్మ ఇంకెంచెం పెద్దది తెచ్చుకుంటే బాగుండేది కదా..? ఏది ఒకసారి ఇటివ్వు అంటూ ఆకాష్ కూడా మంత్రదండం తీసుకుని చూస్తాడు. డోర్ దగ్గర నుంచి అంతా చూస్తున్న మనోహరి మాత్రం ఇరిటేటింగ్గా ఆ ముగ్గురు కాదు అంటే కొంపదీసి అమ్మునా..? అమ్ములోనే దైవశక్తి ఉందా..? అందుకే మొన్న తనను తోయబోయి నేను కింద పడ్డానా..? అనుకుంటూ.. చంభా వైపు చూస్తూ.. అమ్ముకు ఇవ్వు అంటూ అని చెప్తుంది. దీంతో చంభా ఇలా ఇవ్వు బాబు అంటూ ఆకాష్ చేతిలోంచి మంత్రదండం తీసుకుని అమ్ము ఇది ఒకసారి చూడు నాకోసం తెచ్చుకున్నాను అంటూ అమ్ము దగ్గరకు వెళ్తుంటే..
అమ్ము బుక్స్ సర్దుతూ.. ఆనంద్ క్యాంపస్ నుంచి ఇంకా మెసేజ్ ఏం రాలేదు. స్టడీ మెటీరియల్ గురించి క్యాంపస్ ఆఫీసులో కనుక్కోవడం బెటర్ కదా..? అంటుంది. కానీ చంబా చేతిలో మంత్రదండం తీసుకోదు. దీంతో చంభా అమ్ము ఇలాంటిది ఎప్పుడైనా చూశావా నువ్వు అని అడుగుతుంది. మళ్లీ అమ్ము ఓరేయ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మన స్టడీ మెటీరియల్ ముందే తెచ్చుకోవాలి కదా..? అంటుంది. దీంతో చంభా, మనోహరి షాక్ అవుతారు.. ఆనంద్ మాత్రం ఎగ్జామ్స్ ఎఫ్రిల్ లో కదా అమ్ము ఇప్పటి నుంచే టెన్షన్ ఎందుకు అంటాడు. ఆకాష్ కూడా తను ముందే చదివేసి క్యాపంస్ టాపర్ అవ్వాలని అనుకుంటుందిరా అంటాడు.. బయటి నుంచి మనోహరి అమ్ముకు ఎలాగైనా తగలేనా చేయ్ అంటూ చంభాకు సైగ చేస్తుంది.
చంభా అలాగే అంటూ మెల్లగా అమ్ముకు తగిలేలా చేయబోతుంది. అప్పుడే అమ్ము క్యాంపస్ టాపర్ అవుతానని డాడ్కు ప్రామిస్ చేశానురా..? అది నిలబెట్టుకోవాలి కదా..? అంటుంది. ఇంతలో అంజు స్కూల్ ఫస్ట్ వస్తానని నేను కూడా డాడ్కు చాలా సార్లు ప్రామిస్ చేశాను.. జరిగిందా..? అంటుంది. ఇంతలో ఆనంద్ నీకు అమ్ముకు పోలికేంటి అంజు అంటాడు. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినా చాలే నాన్న హ్యాపీగా ఫీలవుతాడు అంటాడు ఆకాష్.. ఇంతలో మనోహరి ఫోన్ రింగ్ అవ్వడంతో అందరూ అటు వైపు చూస్తారు.. చంభా కంగారు పడుతుంది. మనోహరి ఆంటీ ఫోన్ వస్తున్నట్టు ఉంది యాదమ్మ అని అడగ్గానే.. అవునమ్మా మీరు రెడీ అయ్యారో లేదో చూసి రమ్మని నాకు చెప్పింది. ఇప్పుడు ఆవిడ కూడా పైకి వచ్చిందేమో అని చెప్తూ.. చంభా బయటకు వెళ్తుంది.
తర్వాత అమర్ గుడికి వెళ్తాడు. అదే గుడికి మిస్సమ్మ వస్తుంది. గుడిలో దేవుడికి మొక్కి వెళ్తున్న మిస్సమ్మను అమర్ చూస్తాడు. అమర్ను మిస్సమ్మ చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమర్ తిరిగి చూసే సరికి మిస్సమ్మ కనిపించదు. అదే విషయం అమర్ రాథోడ్కు చెబితే మీది భ్రమ అయ్యుంటుంది సార్ అని చెప్తాడు. తర్వాత రాథోడ్ కు గుడిలో కరుణ కనిపిస్తుంది. కరుణతో అమర్ చెప్పిన మాటలు చెప్పగానే.. మీ సార్ ది భ్రమ ఏం కాదు నిజంగానే మిస్సమ్మ వచ్చింది అంటూ రాథోడ్ కు మిస్సమ్మను చూపిస్తుంది కరుణ. మిస్సమ్మను చూసి రాథోడ్ ఎమోషనల్ అవుతుంటాడు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటే అప్పుడే అమర్ వచ్చి చూస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.