IndiGo flight Effect: ప్రభుత్వ కొత్త నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ ప్లానింగ్లో తగిన మార్పులు చేయడంలో విఫలం కావడంతో.. ఈ వారం ఇండిగో సంస్థ దేశ వ్యాప్తంగా వందలాది విమానాలను రద్దు చేసింది. ఈ కారణంగా అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విమాన రద్దు ప్రభావం కర్ణాటకలోని హుబ్లీలో ఒక నవ దంపతులపై పడింది. విమానాలు రద్దు కావడంతో పెళ్లి రిసెప్షన్కు రాలేక, ఓ జంట తమ రిసెప్షన్కు వర్చువల్గా (ఆన్లైన్లో) హాజరు కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెలితే..
వధూవరులు.. హుబ్లీకి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరి వివాహం నవంబర్ 23న భువనేశ్వర్లో జరిగింది. కాగా.. రిసెప్షన్ డిసెంబర్ 3న వధువు స్వగ్రామం హుబ్లీలోని గుజరాత్ భవన్లో ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కోసం డిసెంబర్ 2న భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి హుబ్లీకి బయలుదేరాల్సిన ఈ జంట విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు వేచి ఉన్నారు. చివరకు.. డిసెంబర్ 3న వారి విమానం రద్దయింది. భువనేశ్వర్-ముంబై-హుబ్లీ మార్గంలో ప్రయాణించాల్సిన బంధువులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
రిసెప్షన్ నిర్వహించిన తల్లిదండ్రులు :
అప్పటికే అతిథులు రావడం.. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండటంతో, రిసెప్షన్ను రద్దు చేయలేక వరుడి తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు.
“నవంబర్ 23న పెళ్లి జరిగింది. డిసెంబర్ 3న రిసెప్షన్ ప్లాన్ చేశాం. కానీ తెల్లవారుజామున 4 గంటలకు ఫ్లైట్ రద్దయింది. ఎంతో మంది బంధువులను పిలిచాం. చివరి నిమిషంలో రిసెప్షన్ రద్దు చేయడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో చర్చించుకుని, కొత్త జంటతో స్క్రీన్పై రిసెప్షన్ ఆన్ లైన్ లో ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం,” అని వరుడి తల్లిదండ్రులు తెలిపారు.
Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక సంక్షోభం.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా ప్రిడిక్షన్!
ఇండిగోలో ఆందోళన:
కొత్త ప్రభుత్వ నిబంధనలైన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ను అమలు చేయడంలో ప్రణాళికా లోపాలు, పైలట్ల కొరత కారణంగానే ఈ అంతరాయాలు జరుగుతున్నాయని ఇండిగో అంగీకరించింది.
ఢిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో సహా పలు విమానాశ్రయాలలో ఇండిగో సేవలకు అంతరాయం కలిగింది.
రోజుకు సుమారు 2,200 విమానాలు నడుపుతున్న ఇండిగో, గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలను రద్దు చేసింది.
ఈ ఆపరేషన్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి పూర్తిగా స్థిరపడతాయని, అంతవరకు మరిన్ని రద్దులు డిసెంబర్ 8 వరకు కొనసాగుతాయని ఇండిగో విమానయాన నియంత్రణ సంస్థ DGCA కి తెలియజేసింది.