ముంబై నగరంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన జనాలను వణికిస్తోంది. పండ్ల వ్యాపారి అనుసరించిన అనుసరించిన పద్ధతులు ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో కళ్ళకు కడుతున్నాయి. మలాడ్ వీధుల్లో ఒక పండ్ల వ్యాపారి అరటిపండ్లపై రాటోల్ అనే ప్రమాదకరమైన ఎలుకల మందును పూస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. నిందితుడు అరటిపండ్లకు విషపూరిత క్రీమును పూస్తుండగా గమనించిన స్థానికులు వెంటనే అతనిని నిలదీశారు. ‘పిల్లలు ఇవి తింటారు.. ఎంత ప్రమాదం’ అంటూ అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పండ్లు పాడైపోయాయని అందుకే అలా చేస్తున్నానని సదరు వ్యాపారి బుకాయించడం వీడియో కనబడుతోంది.
సాధారణంగా పండ్లను త్వరగా పండించేందుకు కొందరు అక్రమ వ్యాపారులు కాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తారు. ఈ పదార్థం నుంచి విడుదలయ్యే ఎసిటిలీన్ గ్యాస్ పండ్లను కృత్రిమంగా పసుపు రంగులోకి మారుస్తుంది. పైన చూడటానికి ఎంతో తాజాగా కనిపించినప్పటికీ లోపల పండు సహజంగా పక్వానికి రాదు. రాటోల్ వంటి ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఇథిలీన్ హార్మోన్ తరహాలో పనిచేసి పండ్లను తక్కువ సమయంలోనే ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఈ మోసం తెలియని సామాన్యులు ఆ పండ్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు.
Fruit seller in Malad caught applying Ratol cream on fruits. Ratol is poisonous and can cause vomiting, stomach pain and liver damagepic.twitter.com/VnY5NdMjux
— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍 * (@ggganeshh) February 25, 2026
రాటోల్ కేవలం ఎలుకలను చంపే మందు మాత్రమే కాదు.. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. దీనిని నేరుగా లేదా పండ్ల ద్వారా శరీరంలోకి తీసుకుంటే తీవ్రమైన వాంతులు వస్తాయి. కడుపులో భరించలేని నొప్పి కలగడంతో పాటు తిమ్మిర్లు వస్తాయి. ఈ రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల అవయవాలు ఎదుగుదల దశలో ఉండటం వల్ల వారిపై ఈ ప్రభావం చాలా వేగంగా కనిపిస్తుంది.
మార్కెట్లో దొరికే పండ్లను కొనే ముందు వాటి రంగును చూసి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు అన్ని వైపులా ఒకేలా పసుపు రంగులో ఉంటే అవి రసాయనాలతో పండించినవిగా అనుమానించాలి. పండ్లను ఇంటికి తెచ్చిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కడిగి వాడటం ఉత్తమం. ఆ పండ్ల బండిపై ఉన్న దానిమ్మ పండ్లకు కూడా మందు రాసినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. కంటికి అందంగా కనిపించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మంచిది కాదని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.