Wedding Violence: ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో శునకం కారణంగా పెద్ద గొడవ జరిగింది. దీంతో వధూవరుల బంధువులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలు, కుర్చీలతో రక్తాలు కారేలా పరస్పరం దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లిని రద్దుచేసుకొని.. నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు సైతం చేసుకున్నారు.
పెళ్లి కుమారుడు సుమిత్, వధువు తాన్య జనవరిలోనే ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు దిగి రావడంతో పాటు ఫిబ్రవరి 18న ఫతేపూర్ లో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. వరుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంప్రదాయంలో భాగంగా ఇరు కుటుంబాలు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆభరణాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో కాస్త గందరగోళం చోటుచేసుకోవడంతో వధువు తరుపు వారితో వచ్చిన కుక్క.. బిగ్గరగా మెురగడం ప్రారంభించింది. దీంతో వరుడు బంధువుల్లోని ఒక యువకుడు దానిని కొట్టడంతో వివాదం చెలరేగింది.
పెంపుడు శునకంపై యువకుడు దాడి చేయడంతో వధువు బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వరుడు బంధువులు సైతం అందులో కలుగుజేసుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. కొద్దిసేపటికే అది పరస్పర భౌతిక దాడికి దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘర్షణ సమయంలో కర్రలు, కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారని.. వారిలో మహిళలు సైతం ఉన్నారని తెలుస్తోంది.
Also Read: Inverter AC VS Non Inverter AC: గుడ్డిగా ఏసీ కొనొద్దు.. ఈ తేడా తెలుసుకోండి.. లేదంటే దెబ్బైపోతారు!
గొడవ అనంతరం వధువు, వరుడు కుటుంబాలు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆపై వెంటనే పోలీసులను ఆశ్రయించారు. జరిగిన దాడికి సంబంధించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే వరుడితో పెళ్లి రద్దును వధువు తాన్యా నిరాకరించింది. కుటుంబ సభ్యులను వదిలి.. ఆమె తన అత్తింటివారి వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తిరిగి రమ్మని పిలిచినప్పటికీ.. తాన్యా వారి వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. తన వివాహం జనవరిలోనే జరిగిపోయిందని తెగేసి చెప్పింది. మెుత్తం మీద కుక్క కారణంగా పెళ్లి పెటాకులు అయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: Air Cooler Tips 2026: కూలర్తో ఏసీ రేంజ్ చల్లదనం కావాలా? ఈ 6 చిట్కాలు ఫాలో అయిపోండి!