DGP Suicide: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాజధాని అగర్తలాలో పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయంలో ఆయన విగత జీవిగా కనిపించారు. తన వద్దనున్న గన్తో ఆయన కాల్చుకున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మృతిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కడ్. మూడు దశాబ్దాలుగా పైగా త్రిపుర పోలీసు విభాగంలో ఆయన పని చేస్తున్నారు. గతేడాది మే లో త్రిపుర పోలీసు డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు త్రిపుర రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా పని చేశారు. అంతకుముందు ఆయన సీబీఐ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, కొసావోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో పని చేశారు.
సీబీఐలో ఆయన పని చేసిన కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోడీపై దర్యాప్తునకు నాయకత్వం వహించారు. సీబీఐలో ఎస్పీ స్థాయి నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్ వంటి పలు కీలక పదవులు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-సీఐఎస్ఎఫ్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా పని చేసిన అనుభవం ఆయన సొంతం.
ప్రాథమిక సమాచారం ప్రకారం ధన్వడ్ తన సొంత సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కచ్చితమైన పరిస్థితులు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే డీజీపీ అనురాగ్ వెంటనే గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఆయనకు దాదాపు 40 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసి ప్రయత్నించామని, కానీ ఫలితం లేకపోయిందని తెలిపాయి. పోస్ట్మార్టం నివేదికలో ఏ విధంగా జరిగిందనేది తెలుస్తుందని చెప్పాయి.
ALSO READ: రేషన్ దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల సరుకులు, ఇంకెందుకు ఆలస్యం