Draft Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా, తప్పులను సరిదిద్దే ఉద్దేశంతో ఈ కసరత్తును కొనసాగిస్తున్నారు.
ముసాయిదా జాబితా ముఖ్యాంశాలు
రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లను పరిశీలించగా.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మందితో తాజా డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేశారు. ఈ పరిశీలనలో మరణించిన 15.22 లక్షల మందితో పాటు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మందిని గుర్తించి మొత్తం 44.89 లక్షల పేర్లను తొలగించారు. అయితే, ఎలాంటి నోటీసు లేదా సరైన విచారణ లేకుండా ఏ ఒక్కరి పేరునూ తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలతో భేటీ
ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు వచ్చే నెల 4న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీలకు ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను అందజేస్తారు. ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా లేదా ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు ‘ఫామ్-6’ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలపై విచారణ జరుపుతారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
Also Read: ‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్పై జేసీ హాట్ కామెంట్స్!