Nellore: నెల్లూరు నగరంలో చెత్త నిర్వహణ నిధుల చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ సమరానికి దారితీసింది. పారిశుధ్య పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటే, అవన్నీ ఆధారాలు లేని విమర్శలని కూటమి ప్రభుత్వం అంతే ఘాటుగా సమాధానమిస్తోంది. ఈ మాటల యుద్ధంతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
రూ.1,240 కోట్ల దోపిడీ ఆరోపణలు
చెత్త తొలగింపు పేరుతో పురపాలక శాఖ మంత్రి నారాయణ రూ.1,240 కోట్ల భారీ దోపిడీకి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో 83 లక్షల టన్నులుగా ఉన్న చెత్త లెక్క, ఇప్పుడు హఠాత్తుగా 163 లక్షల టన్నులకు ఎలా పెరిగిందో చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, 132 డంపింగ్ యార్డుల్లో ఎంత చెత్త తొలగించారో స్పష్టమైన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చెత్త నిర్వహణపై 12 ప్రశ్నలు సంధించిన పర్వతరెడ్డి, బుధవారం లోపు సమాధానం చెప్పాలని డెడ్లైన్ విధిస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. ఈ-టెండర్ల విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా పనులు జరుగుతుంటే, కావాలనే అవినీతి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. దాదాపు 60 ఏళ్లుగా నగరవాసులను వేధిస్తున్న అల్లిపురం డంపింగ్ యార్డును ఖాళీ చేసి సమస్యను పరిష్కరిస్తుంటే, ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ఆయన తిప్పికొట్టారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని స్పష్టం చేశారు.
నెల్లూరులో వేడెక్కిన రాజకీయం
ఒకవైపు నగర అభివృద్ధి, వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్తుంటే.. ప్రతిపక్షం మాత్రం అవినీతి లెక్క తేలాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో నెల్లూరు మున్సిపల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
Also Read: బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!