Alluri District: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికితోడు చిన్న చిన్న జలపాతాల వద్ద వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. పరిస్థితి గమనించిన జిల్లా అధికారులు, వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులను నిషేధించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలవరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా గ్రామాలకు ఆనుకొని ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి.
గుల్లెలు పంచాయతీలో కించూరు వెళ్లే రహదారిపై కొండ వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలకు పర్యాటకుల రద్దీ అమాంతంగా పెరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జలపాతాల జోరుగా ప్రవహిస్తుండడంతో పర్యాటకులను నిషేధించారు అధికారులు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాల దాటికి ఏజెన్సీలోని వాటర్ ఫాల్స్ ఉగ్రరూపం దాల్చాయి. పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శనపై కలెక్టర్, పోలీసు యంత్రాంగం తాత్కాలిక నిషేధం విధించారు.
వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పర్యాటకులు ఏజెన్సీలోని వాటర్ ఫాల్స్, వాగుల వద్దకు రాకూడదని ఆదేశాలు ఇచ్చారు. కటికి వాటర్ ఫాల్స్, చాపరాయి రిక్రియేషన్ సెంటర్, తాటిపూడి ప్రాజెక్ట్ సమీప వాగుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్, మత్స్యగుండం వద్ద పర్యాటకులను అనుమతించలేదు అక్కడి సిబ్బంది. చింతపల్లి, లంబసింగి మార్గంలో కాట్రగడ్డ జలపాతం, లింగాల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. గతేడాది చాలామంది వాటర్ ఫాల్స్ సందర్శించి కొట్టుకుపోయారు. పరిస్థితి గమనించిన అధికారులు, పర్యాటకులకు ముందుగా నిషేధం విధించారు.