Amaravati: సోషల్ మీడియాపై ఏపీలోని కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్. కేవలం పిల్లలకు మాత్రమే కాదు. ఇకపై సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు కూడా.
ఏపీలో చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
13 ఏళ్ల లోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంపై విధి విధానాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు ఐటీ శాఖ మంత్రి లోకేష్. దీనికి సంబంధించి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. దీనిపై గురువారం ఉండవల్లిలో మంత్రుల బృందం సమావేశమైంది.
మంత్రుల బృందం.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, సోషల్ మీడియా దుష్ప్రభావానికి లోను కాకుండా 13 నుంచి 16 ఏళ్ల పిల్లలు వయసు ఆధారిత కంటెంట్ ను అందుబాటులో ఉండేలా విధివిధానాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించాలన్నారు.
ముసాయిదా తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు
దీనిపై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచేందుకు ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
నో బ్యాగ్ డే రోజు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏటా రెండుసార్లు నిర్వహించే మెగా పిటిఎంలో కూడా సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కేవలం చిన్నారులపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. మహిళల భద్రతపై స్వయం సహాయ సంఘాల మహిళలకు అవగాహన కల్పిస్తామన్నారు.
ALSO READ: అమరావతిపై అసత్య ప్రచారం.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, అడ్డంగా దొరికేశారు
వయసు నిర్దారణ కోసం డిజి లాకర్తో కూడిన ఏజ్ టోకెన్ వినియోగంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై ప్రజాభిప్రాయం తర్వాత కేంద్రం పరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు తమవంతు పూర్తి సహాయ,సహకారాలు అందిస్తామని సోషల్ మీడియా ప్రతినిధులు తెలిపారు.
ఐటీ చట్టంలోని సెక్షన్-46 కింద న్యాయ అధికారి నియమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ-పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ తోపాటు మెటా డైరెక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామినాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్ చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రామానుజన్ చక్రవర్తి ఈ భేటీలో పాల్గొన్నారు.