Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేడి గాలుల నుంచి ఉపశమనం కలిగిస్తూ వరుసగా కురుస్తున్న వర్షాలు ప్రజలను పలకరిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రానున్న రోజుల్లో వానల జోరు మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనను జారీ చేస్తూ అధికారులు అప్రమత్తం చేశారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత!
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేకంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వానల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది.
ఏపీలో ఐదు రోజుల పాటు వానల ముసురు
మరోవైపు ఏపీలోనూ వాతావరణం చల్లబడింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు. పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
Also Read: బహదూర్గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు.. ఎందుకంటే?