AP Assebley -2026: ఏపీలో బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభ్యులు శాసనసభకు రావడం లేదు. అయితే ఈసారి వస్తున్నట్లు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వైసీపీ సభ్యులు పరిమితం కానున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. దానికి అన్ని పార్టీల నుంచి ముఖ్యనేతలు హాజరుకానున్నారు. సమావేశాలు ఎన్నిరోజులు పెట్టాలనే దానిపై అందులో చర్చించనున్నారు. మరుసటి రోజు నుంచి సభ్యుల సభ్యుల హాజరు అమల్లోకి రానుంది.
కొన్నాళ్లుగా వైసీపీ సభకు హాజరుకాకుండా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి వచ్చింది. ఈనేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్కు సంబంధించి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు రిజిస్ట్రార్ పద్దతి ఉండేది. దాని స్థానంలో హాజరును డిజిటల్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై ఎలక్ట్రానిక్ అటెండెన్స్ అమలు చేయనుంది కూటమి సర్కార్.
వైసీపీకి ఝలక్ ఇచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అసెంబ్లీలో శాసనసభ్యుడు తనకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది. లేకుంటే హాజరు నమోదు కాదు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు కానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్లారిటీ ఇచ్చారు. సభ్యులకు కేటాయించిన సీట్లలో కూర్చొన్న తర్వాత వారి ఫేస్ను కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి. అందుకోసం అసెంబ్లీలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు.
సభలోకి రాకుండా అసెంబ్లీ లాబీల్లో కూర్చొని రిజిస్టర్ తెప్పించుకుని సంతకం చేసి వెళ్లిపోయే రోజులకు కాలం చెల్లింది. డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో అమలవుతోంది. సభ్యుడు అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో వారి హాజరు నమోదు చేస్తున్నారు. ఆ పద్దతిని మరింత మెరుగుపరిచి ఏపీ అసెంబ్లీలో అమల్లోకి తీసుకొస్తున్నారు.
ALSO READ: సొంత కుటుంబసభ్యుల్లా పిఠాపురం ప్రజలు.. ఇద్దరు అనాథలకు అండగా జనసేనాని
అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తే సరిపోదని, సభ్యులు తమ సీట్లలో కూర్చుంటేనే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ నమోదు అవుతుంది. అంతేకాదు సభ్యులు సభలో ఎంతసేపు ఉన్నారు అనేది కూడా రికార్డు కానుంది. ఈ లెక్కన అన్ని పార్టీల సభ్యులంతా అసెంబ్లీకి రావాల్సింది. ఈ విషయం తెలియగానే వైసీపీ అలర్ట్ అయ్యింది.
మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తున్నట్లు తెలిపారు. కేవలం గవర్నర్ ప్రసంగం వరకు వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఉండనున్నారు. సభ్యులు 60 రోజులపాటు సభకు హాజరుకాకుంటే వారి వారి సభ్యత్వాలు రద్దయ్యే ఛాన్స్ ఉంది. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా దాదాపు 40 రోజులు అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో సభ్యులు అసెంబ్లీకి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.