Amaravati: వైసీపీకి మరోసారి చిక్కింది కూటమి సర్కార్. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవడంతో ఓ ఆట ఆడుకుంటోంది వైసీపీ. ఇంతకీ ఏ జీవో విషయంలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కూటమి సర్కార్ చేస్తున్న తప్పులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది వైసీపీ. ఈ క్రమంలో మంగళవారం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఓ విభాగానికి సంబంధించి ఇచ్చిన జీవోను కొద్దిగంటల్లో వెనక్కి తీసుకుంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంది వైసీపీ. ఏపీలోని పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల వీఏఎస్ భర్తీపై ఈనెల 3న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగిస్తూ జారీ చేసిన జీవో21 ని ఉపసంహరించుకుంది. వీఏఎస్ పోస్టులను గతంలో మాదిరిగా డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనుంది ప్రభుత్వం.
మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనుంది. ప్రత్యేక నిబంధనలకు లోబడి అభ్యర్థులకు వర్తించే వెయిటేజ్ని అనుసరించాలని డిసైడ్ అయ్యింది. ఈ శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిజర్వేషన్, రోస్టర్ నిబంధనలను వర్తింప జేయనుంది. ఈ విధానం 2026కు వర్తిస్తుందని, భవిష్యత్లో నియామకాలకు పరిగణించబడదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీఏఎస్ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీకి కాకుండా డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టడంపై విమర్శలు గుప్పించింది వైసీపీ. దీనిపై దాదాపు నాలుగైదు గంటలపాటు వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసింది. చివరకు దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.
కూటమి ప్రభుత్వం 160 పోస్టుల భర్తీకి ముందుకొస్తే విషం చిమ్మడం దారుణమన్నారు. ఎనిమిదేళ్లుగా ఆ శాఖలో నియామకాలు లేక తీవ్రంగా నష్టపోయిన నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ శాఖ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తమకు పాత విధానంలో అవకాశం కల్పించాలని నిరుద్యోగుల సంఘం కోరిందని గుర్తు చేశారు. అభ్యర్థుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి అమలులో ఉన్న GO 52 ఆధారంగా ఇప్పుడు మాత్రమే నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు.
ALSO READ: జనసేన క్లారిటీ.. జగన్ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక
భవిష్యత్తులో ఆయా నియామకాలు APPSC ద్వారా జరుగుతాయని జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ శాఖకు డైరెక్టర్ ఎవరో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేయడం సిగ్గుచేటన్నారు సదరు మంత్రి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేసి తీరుతామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.