Ponguru Narayana: వైసీపీ నేతలు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెట్లు నాటే ప్రతిష్ఠాత్మక కార్యక్రమంపై కూడా ప్రతిపక్షం దిగజారుడు రాజకీయం చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ నాయకుల విమర్శలను సానుకూలంగా తీసుకుని, మరింత పట్టుదలతో మరిన్ని మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు..
గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ, నాటి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ చెత్త పన్ను వసూలు చేయడమే తప్ప, పారిశుధ్యాన్ని పూర్తిగా పక్కనబెట్టిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 153 లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా చేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 టీడీపీ హయాంలో నెల్లూరులో ఏర్పాటు చేయతలపెట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ను విజన్ లేని గత ప్రభుత్వం రద్దు చేసిందని, అలాగే నెల్లూరు పాత మురుగునీటి పారుదల (UGD) పనులను నిలిపివేసి హడ్కో రుణాలను కూడా చేజార్చుకునేలా చేసిందని వివరించారు.
భయపడే ప్రసక్తే లేదు..
తనను వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బతీయాలని లేదా వెనక్కి లాగాలని వైసీపీ ఎంత ప్రయత్నించినా వెనకడుగు వేసేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. ‘నన్ను ఎంతగా రెచ్చగొడితే, నెల్లూరు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంతకు పదింతలు ఎక్కువగా శ్రమిస్తాను. నాపై ఎన్ని అవాకులు చవాకులు పేలినా, ఎన్ని విమర్శలు చేసినా భయపడే ప్రసక్తే లేదు’ అంటూ నెల్లూరు అభివృద్ధికి తన కట్టుబాటును పునరుద్ఘాటించారు.
Also Read: ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క