IRCTC Kashmir Tour 2026: కాశ్మీర్ అందాలను చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, లోకల్ ట్రావెల్, ఫుడ్ ఏర్పాటు చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) క్రేజీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘జన్నత్-ఎ-కాశ్మీర్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, భోజనం, పర్యాటక ప్రాంతాల సందర్శన ఉన్నాయి.
ఈ ప్రత్యేక పర్యటన లక్నో నుంచి ప్రారంభమవుతుంది. 2026 అక్టోబర్ 3న మొదలై అక్టోబర్ 8న ముగుస్తుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ప్రయాణం సాగుతుంది. లక్నో నుంచి శ్రీనగర్కు రానుపోను విమాన ప్రయాణాన్ని IRCTC ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్లో శ్రీనగర్తో పాటు సోనామార్గ్, పహల్గామ్, గుల్మార్గ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. కాశ్మీర్ లోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్యాకేజీని రూపొందించారు.
ప్యాకేజీలో ప్రయాణికులకు త్రీ స్టార్ హోటళ్లలో వసతి కల్పిస్తారు. కొన్ని సందర్భాల్లో హౌస్ బోట్ లో బస చేసే అవకాశం కూడా ఉంటుంది. వసతితో పాటు పర్యటన సమయంలో భోజనం, ఇతర ఆహార సదుపాయాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. శ్రీనగర్లో దాల్ సరస్సు, శంకరాచార్య దేవాలయం, మొఘల్ గార్డెన్స్, నిషాత్ బాగ్, చష్మేశాహి, షాలిమార్ గార్డెన్స్, హజ్రత్ బల్ దర్గా లాంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
పహల్గామ్ పర్యటనలో బేతాబ్ వ్యాలీ, చందన్వారి, అరు వ్యాలీ లాంటి ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది. అలాగే గుల్మార్గ్ లో ఖిలాన్మార్గ్ లాంటి ప్రదేశాలను సందర్శిస్తారు. గుల్మార్గ్ గోండోలా కేబుల్ కార్ కూడా ఈ ట్రిప్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే, గోండోలా ప్రయాణానికి అయ్యే ఖర్చును ప్రయాణికులే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
హోటల్ రూమ్ ఎంత మంది షేర్ చేసుకుంటారనే దానిపై ప్యాకేజీ ధర మారుతుంది. ఒక వ్యక్తి మాత్రమే గదిని ఉపయోగిస్తే ఒక్కొక్కరికి రూ.49,100 చెల్లించాలి. ఇద్దరు కలిసి గదిని షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.43,000గా ధర ఉంటుంది. ముగ్గురు కలిసి బస చేస్తే ఒక్కొక్కరికి రూ. 41,500 చెల్లించాలి. అంటే ముగ్గురు కలిసి ప్రయాణించే వారికి ఈ ప్యాకేజీలో ఖర్చు తక్కువగా ఉంటుంది. కాగా, తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే పిల్లలకు కూడా ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయి. బెడ్ తో కూడిన పిల్లల టికెట్ ధర రూ.33,100 కాగా, బెడ్ అవసరం లేని పిల్లలకు రూ. 30,500గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీకి బుకింగ్ ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్’ విధానంలో ఉంటుందని IRCTC తెలిపింది. ప్రయాణికులు లక్నోలోని గోమతి నగర్లో ఉన్న పర్యటన్ భవన్లోని IRCTC కార్యాలయంలో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా బుకింగ్ సదుపాయం ఉంది.
Read Also: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!