GVMC Wards: వైజాగ్లో వార్డుల లెక్క మారింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు ఉన్న 98 వార్డులని.. 120కి పెంచుతూ మున్సిపల్ శాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన ఈ పునర్విభజన చేపట్టారు. మొదట విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాతే.. 120 వార్డుల సరిహద్దులను ఖరారు చేశారు. వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో ఎన్నికలకు రూట్ క్లియరైంది.
పెరిగిన 22 స్థానాలు ఎవరికి ప్లస్?
జీవీఎంసీ పాలక మండలి పదవీకాలం గత మార్చిలోనే ముగిసింది. అప్పటినుంచి కార్పొరేషన్ కార్యకలాపాలు.. స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పర్యవేక్షణలో నడుస్తున్నాయ్. మరోవైపు.. మేయర్ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. అంటే వార్డు సభ్యులను, మేయర్ను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అసలు రాజకీయం లెక్క ఇక్కడే ఉంది. 2021 ఎన్నికల్లో 98 వార్డుల్లో వైసీపీ 59 స్థానాలు గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంది. టీడీపీకి 29, జనసేనకు 3, బీజేపీకి ఒక స్థానం దక్కాయి. ఇప్పుడు కొత్తగా 22 వార్డులు తోడయ్యాయి. ఈ పెరిగిన స్థానాలు వైసీపీకి మేలు చేస్తాయా? కూటమికి కలిసొస్తాయా? అన్నదే ఇప్పుడు చర్చ. మరోవైపు కూటమిలోనే మేయర్ సీటుపై పోటీ మొదలైంది. విశాఖ మేయర్ పదవిపై జనసేన ఆశలు పెట్టుకుంటే, గతంలో తమకున్న ప్రాతినిథ్యం చూపించి.. మేయర్ పీఠం తమకే కేటాయించాలని బీజేపీ కోరుతోంది. ఇప్పటికే.. అక్టోబర్ చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 22 వార్డులు ఏ పార్టీకి ప్లస్ అవుతాయన్నది త్వరలోనే తేలుతుంది. విశాఖ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
Also Read: ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్లైన్!