Nepal Floods: నేపాల్లో సంభవించిన అకస్మిక వరదలు.. అక్కడి ప్రజలను తీరని శోకంలో ముంచెత్తాయి. వరదల్లో గల్లంతైన వందలాది మంది కోసం గత నాలుగైదు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. నేపాల్ పోలీసులకు మరో కొత్త సవాలు వచ్చి పడింది. వరద ఉధృతికి కనీసం 20 బ్యాంకులకు చెందిన సేఫ్టీ వాల్ట్లు (భద్రతా లాకర్లు) కొట్టుకుపోవడం లేదా బురదలో కూరుకుపోవడంతో పోలీసులకు అతిపెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వాటిని వెతికి పట్టుకోవడం అత్యంత సవాలుగా పరిణమిస్తోంది.
రసువా (Rasuwa), ధాడింగ్ (Dhading), చిత్వాన్ (Chitwan) వంటి ప్రాంతాల్లోని బ్యాంకులు వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని నేపాల్ డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే (Abi Narayan Kafle) వెల్లడించారు. వీటిలోని వాల్ట్లలో భారీ ఎత్తున నగదుతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి వరద నీటిలో కొట్టుకుపోవడమో లేదా బురద కింద కూరుకుపోవడమో జరిగిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ వాల్ట్లు వెళ్లకుండా భద్రపరచడం ఇప్పుడు పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు తమ ప్రాంతానికి కొట్టుకొచ్చిన మనీ లాకర్లను స్థానికులు దోచేస్తున్న ఘటనలు నేపాల్ లో చోటుచేసుకుంటున్నాయి. అప్పర్ రసువా ప్రాంతం నుంచి కొట్టుకువచ్చిన ఒక బ్యాంక్ వాల్ట్ నుంచి సుమారు 92 లక్షల నేపాలి కరెన్సీని దొంగిలించినందుకు ధాడింగ్ జిల్లా పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వరద ప్రభావిత బాధితులను కాపాడటంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడం కూడా తమకు కీలక బాధ్యతగా మారిందని డీఐజీ పేర్కొన్నారు.
వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంక్ వాల్ట్ లను కనుగోనేందుకు నేపాల్ పోలీసులు శ్రమిస్తున్నారు. రెంటు చోట్ల రూ.కోట్ల విలువైన వాల్ట్లను గుర్తించి భద్రపరిచారు. త్రిశూలిలోని ‘అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంక్’ ధుంగే శాఖకు చెందిన వాల్ట్ను దాదాపు 8 గంటల పాటు శ్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వాల్ట్లో NPR 1.5 కోట్ల నగదుతో పాటు సుమారు NPR 50 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే నువాకోట్లోని ‘కృషి వికాస్ బ్యాంక్’ వాల్ట్ను కూడా పోలీసులు సురక్షితంగా వెలికితీశారు.
Also Read: సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !
ఇదిలా ఉంటే ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ సహాయక చర్యల కోసం దాదాపు 7,894 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించినట్లు పోలీసు ప్రతినిధి వెల్లడించారు. ఒకవైపు గల్లంతైన మానవ ప్రాణాలను కాపాడటం, మరోవైపు ప్రజల సొత్తును అసాంఘిక శక్తుల బారిన పడకుండా రక్షించడం కోసం రెస్క్యూ టీమ్లు శ్రమిస్తున్నాయి.
Also Read: బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య