Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వెలిగొండ ప్రాజెక్టు వాగులో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. ఘటన సమయంలో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. మరో ముగ్గుర్ని రెస్క్యూటీమ్ కాపాడింది. అసలు ఘటన ఎలా జరిగింది?
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్లోకి చేరుతున్నాయి. పెద్దారవీడు మండలంలోని కలనూతలలో అరటితోటలో కాయలు కోసేందుకు బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లారు. మధ్యలో వెలిగొండ ప్రాజెక్టు వాగు దాటుతుండగా కృష్ణమ్మ ప్రవాహానికి వాహనం కొట్టుకుపోయింది. అందులో ఒకరు గల్లంతు అయ్యారు. మరో ముగ్గురు వ్యక్తులు సమీపంలోని చెట్లును పట్టుకుని తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు.
వాహనం గల్లంతు విషయం తెలియగానే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. నీరు ప్రవాహం తగ్గిన తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. ఘటన విషయం తెలియగానే ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాత్రి నల్లమల సాగర్లోకి కృష్ణమ్మ పరుగులు పెట్టిందన్నారు. బొలెరో వాహనం వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లిందని, వచ్చేటప్పుడు నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో వాహనం కొట్టుకుపోయిందన్నారు.
వాహనంలోని ముగ్గురు వ్యక్తులు వాగులోకి దూకి చెట్టుని పట్టుకుని రక్షించుకున్నారు. చెట్టు ఎక్కి తమను కాపాడాలంటూ ముగ్గురు వ్యక్తులు కేకలు వేశారని, ఈ విషయం అధికారులకు చేరిందన్నారు. మరొకరు గల్లంతు అయ్యారు. రాత్రి ఏడున్నర గంటలకు తమకు ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లామని తెలిపారు. తెల్లవారుజామున రెస్క్యూ బృందాలు అక్కడే ఉండి ముగ్గుర్ని కాపాడి బయటకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు. నల్లమలసాగర్కు కృష్ణా జలాలు ముంపు గ్రామాల్లోకి చేరుతున్నాయి. పల్లపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు.
ALSO READ: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?