Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. దీని కారణంగా బెంగాల్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ వర్షాలు పడే అవకాశం ఉంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం బెంగాల్-ఉత్తర ఒడిశా ప్రాంతాల కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతోంది. దీనికితోడు అల్పపీడనం రుతుపవన ద్రోణి గుండా ప్రయాణించి అక్కడి నుండి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు తెలిపింది.
మధ్య-తూర్పు తెలంగాణ జిల్లాల్లోని యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ వర్షాలు మధ్యాహ్నం నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ఇతర జిల్లాల్లో మధ్యాహ్నం వరకు చిరు జల్లులు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం నుండి మంగళవారం రోజు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రాగల 2-3 గంటల్లో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక హైదరాబాద్ సిటీ తెల్లవారుజామున నుంచి వివిధ ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి. అలాగే గాలి కూడా బలంగా వీస్తోంది. మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల్లో చినుకులు పడతాయని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
Also Read: 1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఏపీలోనూ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణకోస్తా, రాయలసీమ, యానాం వంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులు కూడా రానున్నాయి. ఆ సమయంలో ఈదురుగాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నట్లు తెలియజేసింది.