Kodi Pandalu: ఏపీలో జోరుగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు.. కోనసీమ జిల్లావ్యాప్తంగా కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పచ్చని అరటి తోటలు, కొబ్బరి తోటల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందెం బరులు తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని అమలాపురం, రావులపాలెం, పి.గన్నవరం, కొత్తపేట వంటి ప్రధాన కేంద్రాల్లో పందెం రాయుళ్ల సందడి నెలకొంది. కేవలం స్థానికులే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా తరలిరావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది.
కాలికి కత్తి కట్టి.. కదనరంగంలోకి!
అయితే బరిలోకి దిగే కోడి పుంజులకు నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా కత్తులను కడుతున్నారు. సుమారు రెండు నుంచి మూడు అంగుళాల పొడవున్న వాడియైన కత్తులను కోడి కాలికి కట్టి కదనరంగంలోకి వదులుతున్నారు. ‘డేగ’, ‘కాకి’, ‘నెమలి’, ‘సేతువ’ వంటి రకాల పుంజులు ఒకదానికొకటి తలపడుతుంటే, వాటి యజమానులు, పందెం కాసేవారు ఉత్కంఠతో ఊగిపోతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే గెలుపోటములు నిర్ణయమవుతుండటంతో బరుల వద్ద వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది.
కోట్లలో చేతులు మారుతున్న నగదు
ఈ పందాల వెనుక లక్షలాది రూపాయల బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఒక్కో పందెంపై వేల నుంచి లక్షల వరకు పందాలు కడుతున్నారు. కేవలం కోడి పందాలే కాకుండా, బరుల చుట్టుపక్కల గుండాట, పేకాట వంటి ఇతర జూద క్రీడలు కూడా జోరుగా సాగుతున్నాయి. అనధికారిక అంచనాల ప్రకారం, జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పందెం గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోతుండగా, ఓడిన వారు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
ఈ పందాలపై హైకోర్టు కఠినమైన నిబంధనలు విధించినా, పోలీసులు ఆంక్షలు విధించినా నిర్వాహకులు అవేవీ పట్టించుకోవడం లేదు. కత్తులు కట్టకూడదని, జూదం ఆడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక చోట్ల రాజకీయ నాయకుల అండదండలతో పందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసులు అక్కడక్కడ తనిఖీలు చేస్తున్నప్పటికీ, పందెం బరుల వద్ద జనం తాకిడిని నియంత్రించడం వారి వల్ల కావడం లేదు.
Also Read: భోగి సంబరాలు.. జగన్ పాటకు అంబటి మాస్ స్టెప్పులు.. పవన్ పై కీలక వ్యాఖ్యలు
కిటకిటలాడుతున్న పందెం బరులు
కోడి పందాలను చూడడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పందెం బరుల వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీలు ప్రేక్షకులతో నిండిపోయాయి. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు సైతం ఈ సంప్రదాయ పందాలను చూసేందుకు స్వగ్రామాలకు చేరుకోవడం విశేషం. ఈ సందడి వల్ల జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు అన్నీ కిక్కిరిసిపోయాయి. సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ పందాలు ఒకవైపు వినోదాన్ని పంచుతుంటే, మరోవైపు చట్ట ఉల్లంఘనలు చర్చనీయాంశంగా మారాయి.