V Srinivasa Rao: విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో విద్యా వ్యవస్థ వైఫల్యాల నుంచి మొదలుకొని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాల వరకు పలు కీలక అంశాలపై ఆయన నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ పాలకుల తీరును ఎండగట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
దేశంలో అత్యున్నత పరీక్షలను నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందని శ్రీనివాసరావు విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడిన నిందితులను పక్కన పెట్టుకుని ప్రధానమంత్రి మాట్లాడుతుండటం దారుణమన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని ఖండిస్తూ, విద్యార్థి సంఘాల పోరాటానికి సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ అక్రమ అరెస్టులు, విద్యా రంగ వైఫల్యాలపై రేపు సాయంత్రం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
చంద్రబాబు, జగన్లపై విమర్శలు
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై ఎంపీలు గళమెత్తాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మారాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా కళ్ళు మూసుకుని, రెండు చేతులెత్తి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని మండిపడ్డారు. ఆక్వా రంగం సంక్షోభంలో ఉంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాసి ముఖ్యమంత్రి చేతులు దులుపుకుంటే సరిపోదని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవులు నాశనమవుతుంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఎలా చూస్తూ ఊరుకుంటారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికే ‘ఎల్ నినో’ ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, నదులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1/70 చట్టాన్ని పరిరక్షించి, అడవులను, పర్వతాలను కాపాడుకుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని, లేదంటే ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసుల పక్షపాత వైఖరి
టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఒక మహిళను వివస్త్రను చేసి అవమానించిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు తన అనుచరులేనని సదరు ఎమ్మెల్యే ఒప్పుకుంటూ.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మాత్రమే సరిపోదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే యూట్యూబర్లపై వెంటనే కేసులు పెట్టి వేధించే పోలీసులు, మహిళను అంతలా అవమానించిన వారిపై ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు.