Faridabad Crime: కారణం ఏంటో తెలీదు.. రాత్రికి హల్వా తిన్నారు. అందులో ఏమైనా కలిసిందా? లేకుంటే కలిపారా? అనేది తెలీదు. తెల్లవారేసరికి ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సంచలనం రేపిన ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగుచూసింది. ఘటన వెనుక ఏం జరిగింది? మృతులు ఎక్కడివారు? అనే విషయాల్లోకి వెళ్తే..
ఫరీదాబాద్లో ఘోరం.. హల్వా తిన్న ఫ్యామిలీ
హర్యానాలోని ఫరీదాబాద్ పరిధి నసరూర్పూర్ ప్రాంతంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించారు. వారిలో భార్యభర్తలు, వారి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. వీరంతా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రాత్రి నిద్రపోయే ముందు వీరంతా హల్వా తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు కుటుంబసభ్యులు ఆ ఇంట్లో కలిసి నిద్రిస్తున్నారు.
బుధవారం ఉదయం వారిలో ముగ్గురు మృతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో బొగ్గు పొయ్యి కనుగొన్నారు. అలాగే పక్కన హల్వా కనిపించింది. మరణానికి ఖచ్చితమైన తెలీదని, పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
తెల్లవారేసరికి విగతజీవులుగా, పోలీసుల విచారణ మొదలు
మృతులు రమేష్, అతడి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ ఇంట్లో రమేష్ సోదరుడు ఉంటున్నాడు. ఇంటి యజమాని చెబుతున్న వివరాలు మేరకు.. రమేష్ దంపతులు, అతడి సోదరుడు ముగ్గురు కూలీలుగా పని చేస్తున్నారు. రెండు నెలల కిందట ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరు బీహార్కు చెందినవారు.
గత రాత్రి రమేష్ ఇంట్లో హల్వా తయారు చేశారు. అందరూ దాన్ని భుజించారు. ఉదయం ఐదు గంటల సమయంలో సోదరుడు.. అన్న-వదినను నిద్రలేపడానికి ప్రయత్నించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రమేష్ నోటి నుండి రక్తం కనిపించింది. మిగతా వారి నోటి నుండి నురగలు వచ్చినట్టు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు.
ALSO READ: సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఆర్థిక సమస్యల నేపథ్యంలో హల్వాలో విషం కలిపి ముగ్గురు తిన్నారా? కాకపోతే ఎవరైనా చంపారా? అనేది ఆసక్తికరంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారి గురించి ఇరుగుపొరుగు వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఏం జరిగిందో తెలుస్తుందని అంటున్నారు అధికారులు.