IPS Harassment: స్వేచ్ఛ బ్యూరో: ప్రతిష్టాత్మకమైన నేషనల్ పోలీస్ అకాడమీలో ఊహించని సంఘటన జరిగింది. ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న ఓ అధికారి తోటి మహిళా ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చెయ్యగా అత్తాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనకు అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తున్నట్టు పేర్కొంది. ఈనెల 9న ఉదయ్ కృష్ణారెడ్డి తనను జుట్టుపట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించినట్టు తెలిపింది. అంతటితో ఆగకుండా తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని పేర్కొంది.
ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని ఆ ప్రైవేట్ వీడియోలను తన భర్తకు వాట్సాప్ ద్వారా పంపాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 74, 75, 77, 315(2), ఐటీ యాక్ట్ 66 (సి) కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రంలో కాబోయే ఐపీఎస్ అధికారుల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Also Read: బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!