Konaseema: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వెళ్లిన ఓ కుటుంబంలో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. సముద్ర స్నానానికి దిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హృదయ విదారక సంఘటన అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో చోటుచేసుకుంది.
సరదాగా వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి
అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు ఆదివారం సాయంత్రం సరదాగా గడుపుదామని ఓడలరేవు సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. వారంతా సముద్రపు అలల మధ్య కేరింతలు కొడుతూ స్నానాలు చేయడానికి నీటిలోకి దిగారు. అయితే, సముద్రపు పోటు తీవ్రతను గమనించే లోపే ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు పెద్ద అలల తాకిడికి కొట్టుకుపోయి నీటిలో గల్లంతయ్యారు.
వెలికితీసిన మృతదేహాలు
యువకులు నీటిలో మునిగిపోతుండటం చూసి మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై కేకలు వేశారు. వెంటనే స్థానికులు, మత్స్యకారులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు అనంతరం సముద్రంలో మునిగిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను అరవింద్ (23), శ్రీరామ్ (17), సాయిగా గుర్తించారు.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
మృతి చెందిన యువకులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలలో ప్రైవేట్ ఉద్యోగాలు, చదువులు చదువుకుంటూ ఇటీవలె తమ స్వగ్రామమైన మాచవరానికి వచ్చారు. సెలవుల్లో ఇంటికి వచ్చి అందరితో కలిసి ఆనందంగా గడుపుదామనుకున్న యువకులు.. ఇలా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తీరంలో మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు పెడుతున్న రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!