Flexi war YCP vs Janasena(Political news in AP) : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందంటున్నారు. పెత్తందారులకు , పేదవాడికి మధ్య యుద్ధం జరుగుతోందని ప్రతి వేదికపై పదే పదే చెబుతున్నారు.
అటు రాష్ట్రంలో సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. రాక్షస పాలనకి అంతం.. ప్రజా పాలనకి ఆరంభం అంటూ జనసేనాని నినదిస్తున్నారు. ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు జనసేన కార్యకర్తలు తమ పార్టీ అధినేతల స్లోగన్స్ ఫ్లెక్సీల రూపంలో పెట్టడం వివాదాన్ని రేపుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీ వార్ చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రేపుతోంది.
తాజాగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో వైసీపీ, జనసేన నాయకుల మధ్య ఫ్లెక్సీల వార్ సాగుతోంది. పోటా పోటీగా ఫెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం వేడెక్కింది.
పేదలకీ, పెత్తందారులకీ మధ్య యుద్ధం పేరిట వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అందులో పవన్ కల్యాణ్ ను పల్లకీ మోస్తున్నట్టు చూపించారు. దీంతో జనసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. సమాజంలో అశాంతిని కలిగించే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని ఆందోళన చేపట్టారు.
వైసీపీ ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన కార్యకర్తలు కూడా ఒంగోలులో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. “రాక్షస పాలనకి అంతం- ప్రజా పాలనకి ఆరంభం” అంటూ జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఫ్లెక్సీలు పెట్టారు. ఇందులో జగన్ ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి తలను పట్టుకున్నట్లు చూపించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.