Amaravati: దేశంలోని అన్నిరంగాల్లో పోటీ నడుస్తోంది. ఎవరు తక్కువకు సరుకులు ఇస్తే.. వాళ్ల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా మీ మార్ట్లు వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేసింది కూటమి ప్రభుత్వం. దానివల్ల ఫలితం ఏంటి? బయట కొనుగోలు చేసే వస్తువుల కంటే తక్కువగా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం?
రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త- ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కుటుంబాలకు మరో కీలక శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటు ధరల్లో తేవాలని ఆలోచన చేసింది. అంతేకాదు రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త వ్యవస్థను తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా మీ మార్ట్-Mee Mart అనే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తోంది.
అందుబాటులోకి రానున్న మీ మార్ట్లు- ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 వేల రేషన్ షాపులు ఉన్నాయి. వీటిని దశలవారీగా మీ మార్ట్లుగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. తొలిదశలో 1,000 మీ మార్ట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తోంది. తొలి విడత 553 షాపులను ప్రారంభించనున్నారు. మిగతా షాపులను అంచెలంచెలుగా అందుబాటులోకి తీసుకురానుంది.
తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు- ఇప్పటికే ఏపీలోని గుంటూరు జిల్లా లాలుపురంలో ఫస్ట్ మీ మార్ట్ షాపుని ప్రారంభించిన విషయం తెల్సిందే. దీనికి ‘మీ మార్ట్-నీది.. నాది మనందరిది’ అనే ట్యాగ్ లైన్ సైతం ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మీ మార్ట్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల బయట ధరల కంటే సామాన్యులు 3 నుంచి 5 రూపాయల తక్కువగా లభిస్తోందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘డీ మార్ట్’ తరహాలో.
రేషన్ షాపులు కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు అందించే చిన్న సూపర్ మార్కెట్లుగా మారనున్నాయి. దీనివల్ల పేద-మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించనున్నాయి. మీ మార్ట్ అనేది రేషన్ షాపులకు అనుసంధానంగా ఏర్పాటు చేసే ప్రత్యేక రిటైల్ వ్యవస్థ.
ALSO READ: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!
ప్రభుత్వం ఇచ్చే రేషన్ తోపాటు కుటుంబాలు ప్రతీ రోజూ ఉపయోగించే అనేక రకాల నిత్యావసర వస్తువులను విక్రయించనున్నారు. ఈ లెక్కన కిరాణా షాపులకు ప్రజలు వెళ్లాల్సిన పని లేదు. అవసరమైన వస్తువులను మీ మార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్-NCCF- ఫ్రంటియర్ మార్కెట్ సప్లై చైన్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తోంది పౌర సరఫరాల శాఖ.
మీ మార్ట్ల్లో దాదాపు 250 రకాల వస్తువులు అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వం ఆలోచన.ఎప్పటి మాదిరిగానే బియ్యం, పప్పులు, గోధుమ పిండి, చక్కెర, ఉప్పు, వంట నూనెలు మాత్రమే కాదండోయ్. మసాలా దినుసులు, టీ-కాఫీ, సబ్బులు, గృహ వినియోగ వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ దొరకనున్నాయి.