Kotadibba: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక-చారిత్రిక వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. తిరుపతి జిల్లాలోని గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. 22 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం, ఇకపై కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండనుంది.
తిరుపతి జిల్లాకు అరుదైన గుర్తింపు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గ్రామంలోని దాదాపు 24 ఏకరాల ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. వాటి చుట్టూ 100 మీటర్ల మేరా నిషేధిత ప్రాంతంగా పేర్కొంది.
కోటదిబ్బ ప్రాంతానికి జాతీయ గుర్తింపు: 200 మీటర్ల వరకు నియంత్రిత భాగంగా పరిగణించింది. ఇకపై ఈ ప్రాంత సంరక్షణ బాధ్యతలను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చూడనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతం రెండువేల సంవత్సరాల కిందట శాతవాహనుల కాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేది.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2019లో తిరుపతి పురావస్తుశాఖ అధికారులు చేసిన తవ్వకాల్లో విగ్రహాలు, బావులు, కోటగోడ, డ్రైనేజీ వ్యవస్థ, పలు పనిముట్లు బయటపడ్డాయి. ఆ తవ్వకాల్లో విష్ణు మూర్తి శిల్పం, మట్టి పాత్రలు బయటపడ్డాయి. లభించిన ఇటుకలు శాతవాహనులు కాలంలో అమరావతి-నాగార్జున కొండల్లో లభించిన వాటికి దగ్గరగా ఉన్నాయి.
శాతవాహనులు కాలంలో బయటపడిన అవశేషాలు: వాటిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఆ అవశేషాలు 2 వేల ఏళ్ల పూర్వం నాటివని అంచనా వేశారు. 1958 నాటి పురాతత్వ ప్రదేశాల చట్టం ప్రకారం ఈ భూభాగాన్ని జాతీయ సంపదగా నోటిఫై చేసింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలో అడుగు వేసింది. జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది.
ALSO READ: శ్రీవారి చెంతకు కానుకల వెల్లువ.. టీటీడీ ట్రస్టులకు రూ.41 లక్షల విరాళాలు.. ఆ దాతలు ఎవరంటే?
ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి పేర్కొంది. అందుకు రెండు నెలల గడువు ఇచ్చింది. ప్రజల నుంచి అభ్యంతరాలు, వ్యతిరేకత లేకపోవడంతో నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్తో కోటదిబ్బ పరిసర ప్రాంతం భారత పురాతత్వశాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. అక్రమ తవ్వకాలు, ప్రైవేట్ నిర్మాణాలు జరగకుండా కఠినమైన చట్టాలు అమలుకానుంది.