Garlic Mosquitoes: సహజసిద్ధమైన పద్ధతుల్లో దోమలు, ఇతర ఎగిరే కీటకాలను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. వెల్లుల్లిలో ఉండే ఒక సహజ సమ్మేళనం దోమల సంతానోత్పత్తిని శక్తివంతంగా అడ్డుకుంటుందని అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ (Yale University) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వెల్లులితో దోమలకు చెక్ పెట్టడమనేది భారత్ లో కొత్తేం కాదు. పూర్వం నుండి దోమలకు సాంప్రదాయ నివారణికి వెల్లుల్లిని మన పెద్దలు వాడుతూ వచ్చారు. అయితే వెల్లుల్లి అనేది కేవలం వాటిని దూరంగా ఉంచడమే కాకుండా వాటి సంతానోత్పత్తి ప్రక్రియను సైతం పూర్తిగా నిలిపివేస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించారు. ప్రసిద్ధ అంతర్జాతీయ జర్నల్ ‘సెల్’ (Cell) లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాల ప్రకారం.. యేల్ శాస్త్రవేత్తల బృందం వెల్లుల్లిలోని రహస్యాన్ని ఛేదించింది.
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 43 రకాల విభిన్న పండ్లు, కూరగాయల నుంచి సేకరించిన రసాయన సమ్మేళనాలను (Extracts) పరీక్షించారు. ఈ క్రమంలో వెల్లుల్లిలో లభించే ‘డయాలీల్ డిసల్ఫైడ్’ (Diallyl Disulfide) అనే కీలక సమ్మేళనాన్ని వారు గుర్తించారు. ఇది ఫ్రూట్ ఫ్లైస్ (ఈగలు), సెట్సే ఈగలు, ప్రమాదకరమైన ఎడెస్ (Aedes) దోమలలో కలయికను, గ్రుడ్లు పెట్టే ప్రక్రియను తీవ్రంగా నిరోధిస్తున్నట్లు వారు గమనించారు.
ఈ నిరోధక ప్రక్రియ వెల్లుల్లి వాసన వల్ల కాకుండా దాని రుచి వల్ల జరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఆడ కీటకాలు ఈ ‘డయాలీల్ డిసల్ఫైడ్’ సమ్మేళనాన్ని రుచి చూసినప్పుడు వాటి అవయవాలలో ఉండే ‘TrpA1’ అనే సెన్సరీ రిసెప్టర్ (Sensory Receptor) ఉత్తేజితమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది వాటి జన్యువుల పనితీరులో మార్పులను తెచ్చి కీటకాల్లో ‘కడుపు నిండిపోయింది’ (Extreme Satiety) అనే భ్రమను కలిగిస్తున్నట్లు కనుగొన్నారు. దీనివల్ల ఆ కీటకాలు తాము సంతానోత్పత్తికి పనికిరానంతగా నిండుగా ఉన్నట్లు భావించి ఆ ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: తక్షశిలకు పాక్ తూట్లు.. ‘వారసత్వ హోదా’ ఊడుతుందా? యునెస్కో సీరియస్ వార్నింగ్!
ఈ పరిశోధనను ప్రముఖ శాస్త్రవేత్తలు ఇబ్రహీం సామ్, కార్ల్సన్ జే.ఆర్ నేతృత్వంలోని బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఇది భవిష్యత్తులో విఫ్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. పర్యావరణ అనుకూలమైన దోమల నివారణ ప్రక్రియకు ఇది దారితీస్తుందని అంచనా వేశారు. హానికరమైన కెమికల్స్ తో పనిలేకుండా కేవలం వెల్లుల్లిని ఉపయోగించి.. దోమల జనాభాను తగ్గించడానికి ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని శాస్త్రవేత్తల బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read: అయోధ్య విరాళాల చోరీ.. యోగి సర్కార్ సీరియస్.. ‘బుల్డోజర్’ యాక్షన్కు రంగం సిద్ధం!