Weather Updates: దేశవ్యాప్తంగా నైరుతు రుతువపనాలు విస్తరించాయి. తూర్పు నుంచి ఉత్తరం వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణాదికి బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా ఏపీ-తెలంగాణల్లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
భారీ వర్ష సూచన-రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు దక్షిణాది-తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రభావిత ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ఆకస్మిక వరదల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గురువారం కూడా ఆ జిల్లాలకు అలర్ట్-ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరోవైపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక భాగ్యనగరంలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. ఉదయం నుంచి చినుకులు పడుతున్నా, మధ్యాహ్నం తర్వాత ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముందని తెలియజేసింది.
రికార్డు స్థాయి వర్షపాతం నమోదు-బుధవారం ఉత్తర తెలంగాణలో విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో జగిత్యాల జిల్లాలోని సారంగపూర్-20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. బుగ్గారం-18.2, నిర్మల్ జిల్లా కడంపెడ్డూర్-14.5 సెం.మీ, పెద్దపల్లి జిల్లా కామన్పూర్-14.1 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ములుగు జిల్లాలో బుధవారం భారీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో 10 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. జయశంకర్ భూపాలపల్లిలో 11 సెం.మీ, ఆ తర్వాత పెద్దాపల్లిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.
ALSO READ: చంచల్ గూడ జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తరలింపు
కోస్తాంధ్ర-రాయలసీమకు వర్ష సూచన-ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి నెలకొంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలకు తోడు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో పిడుగులు ముప్పు పొంచి ఉందని, ఈ విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.