Jagan-Vijay Sai Reddy: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ట్రెండ్కు తగ్గట్టుగా రాజకీయ నేతలు టర్న్ అవుతుంటారు. చివరకు మళ్లీ నేతలంతా పాత గూటికి చేరుకున్న సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి విషయంలో అదే నిజమవుతుందా? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.
విజయసాయిరెడ్డి మీడియా ఎంట్రీ వెనుక
శనివారం సోషల్ మీడియా వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ప్రకటన చేశారు. తాను మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆయన నుంచి ప్రకటన రాగానే వైసీపీ శ్రేణుల్లో ఒకటే ఆనందం. వైసీపీ పేటీఎం బ్యాచ్గా చెబుతున్నవారి ఆనందానికి అవధుల్లేవు. ఇక తమకు కష్టాలు తీరినట్టేనని వారంతా భావిస్తున్నారు.
వైసీపీలో ఉన్నప్పుడు సొంతంగా మీడియాను ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి ఆలోచన చేశారు. అప్పుడు పరిస్థితులను అది వర్కవుట్ కాలేదు. ఆయన ఆలోచన రేపో మాపో కార్యరూపం దాల్చనుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవల కాలంలో మీడియాను బాగా వాచ్ చేస్తున్నారట సాయిరెడ్డి. వైసీపీకి చెందిన వార్తలు వారి మద్దతు మీడియాలో తప్పతే మరే ఛానెళ్లలో రాలేదన్నది ఆయన భావన.
జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. సాయిరెడ్డి స్వామి కార్యం.. స్వకార్యం కూడా
వైసీపీకి చెందినవారు అన్ని ఛానెళ్లలో ఉన్నారు. వారందరిని ఒక్కతాటి మీదకు తీసుకురావాలని సాయిరెడ్డి భావిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు బలంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ మీడియా పలు విషయాల్లో వైసీపీ అధినేత జగన్ను పదే పదే ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఒకానొక దశలో నేషనల్ మీడియాపై జగన్ రుసరుసలాడిన సందర్భాలు లేకపోలేదు.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియా వైపు ఫోకస్ చేశారు. దీని వెనుక అంతా నడిపిస్తున్నది జగన్ అని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే వైసీపీకి మద్దతు ఇచ్చే యూట్యూబ్ ఛానెళ్లు చాలానే ఉన్నాయి. వాటికి సాయిరెడ్డి మీడియా కూడా తోడైతే వైసీపీకి మాంచి ఊపు వస్తుందని అంటున్నారు.
ALSO READ: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమం.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో పోరాటం
వచ్చే ఏడాది నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. ఆయన యాత్ర మొదలుపెట్టే నాటికి మీడియాను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తున్నారట. రాజకీయ పరంగా కూటమిని విఛ్చిన్నం చేయలేకపోయినా రకరకాల వార్తలతో విభేదాలు క్రియేట్ చేసే అవకాశముందని కూటమిలో కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడకుంటే మొదటికే ఇబ్బందులు వస్తాయని కొందరు టీడీపీ నేతలు అనుకుంటున్నారు. మొత్తానికి కూటమి విడగొట్టేందుకు మరొక అస్త్రాన్ని జగన్ ప్రయోగిస్తున్నారన్నమాట.