Maoists In AP: ఏపీలో మావోయిస్టుల ఉనికి మొదలైందా? తలదాచుకోవడానికి ఏపీకి వచ్చారా? రాజకీయ నేతలను టార్గెట్ చేసి ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? చాలా చోట్ల షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నారా? చాలా జిల్లాల్లో పోలీసులు సోదాల వెనుక ఏం జరుగుతోంది? ఉన్నట్లుండి మావోల చూపు ఏపీపై ఎందుకు పడింది? ఇవే ప్రశ్నలు రాజకీయ నాయకులను వెంటాడుతున్నాయి. ఏపీలో అసలేం జరుగుతోంది.
ఏపీలో మావోయిస్టుల కలకలం..
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు. అనుకున్నట్లుగానే మావోయిస్టుల కంచుకోటలను కేంద్ర-రాష్ట్ర బలగాలు నేల కూల్చాయి. అగ్రనేతలను మట్టుబెట్టాయి కూడా. ఇక మావోయిస్టుల పనైపోయిందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా విజయవాడ న్యూ ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులు పట్టుబడడం కలకలం రేపింది.
ఛత్తీస్ఘడ్కు చెందిన 28 మంది మావోయిస్టులను బలగాలు అరెస్టు చేశాయి. విజయవాడ ఆటోనగర్లో ఓ భవాన్ని షెల్టర్గా చేసుకుని తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బలగాలు మోహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన 28 మందిలో 9 మంది మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి రక్షణ గార్డులని తేలింది. నలుగురు వ్యక్తులు కీలక హోదాల్లో పని చేస్తున్నవారు ఉన్నారు.
టార్గెట్ రాజకీయ నేతలు.. విజయవాడలో షెలర్ట్ ఏర్పాటు
పట్టుబడిన మావోయిస్టుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఎక్కువమంది చత్తీస్ఘడ్కి చెందినవారు ఉన్నారు. విజయవాడకు అగ్రనేత హిడ్నా వచ్చాడని, అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో మారేడుమిల్లి వద్ద ఎదురుకాల్పుల్లో హతమయ్యాడని అంటున్నారు. కేవలం 10 రోజుల కిందట కూలిపనుల కోసం వచ్చారని స్థానికులు చెబుతున్నారు.
కానీ మూడు వారాల కిందట విజయవాడ సిటీలో మావోయిస్టులు అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. కేవలం విజయవాడలోనే కాదు ఐదు జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్-ఆక్టోపస్ బృందాలు సోదాలు చేస్తున్నాయి. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో మావోయిస్టు డంప్ ల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ALSO READ: ఏపీలో హిడ్నా ఎన్కౌంటర్ వివాదం.. పౌర హక్కుల నేతల ఆరోపణలు
రాజకీయ కీలక నేతల కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెక్కీ చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. మావోలపై నిర్బంధం పెరిగిన నేపథ్యంలో ఉనికిని నిరూపించేందుకు అగ్రనేతలను టార్గెట్ చేస్తారని అంటున్నారు. విజయవాడలో దొరికినవారు గెరిల్లా ఆర్మీకి చెందినవారు కావడంతో మరింత అనుమానాలు బలపడుతున్నాయి.
మావోయిస్టుల అరెస్టు విషయం తెలియగానే రాజకీయ నేతల్లో వణుకు మొదలైంది. ఉన్నట్లుండి మావోల దృష్టి ఏపీపై ఎందుకు పడిందంటూ చర్చించుకోవడం మొదలైంది. చాలామంది నేతలు హైదరాబాద్కు పయనం అవుతున్నట్లు సమాచారం. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈలోగా మావోయిస్టుల గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టుల చీఫ్ దేవ్జీ?
రెక్కీ చేసి అగ్రనేతను మట్టుబెట్టేందుకు వచ్చారని భావిస్తున్న పోలీసులు
పార్టీపై నిర్బంధం పెరిగిన నేపథ్యంలో ఉనికిని నిరూపించేందుకు అగ్ర నేతలను టార్గెట్ చేస్తారని చెబుతున్న పోలీసులు
విజయవాడలో దొరికినవారు గెరిల్లా ఆర్మీకి చెందినవారు… https://t.co/4hBHQ27Ta5 pic.twitter.com/9wth1CXuwD
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2025