Maoist commander Hidma: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై తీవ్ర వివాదం రాజుకుంది. గత నెల 28న మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా, అతని సహచరులను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో, విజయవాడలో భారీ సంఖ్యలో మావోయిస్టు కేడర్ను, అగ్ర నేతల రక్షణ గార్డులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఏపీలోని ఒక షెల్టర్లో ఉన్న హిడ్మా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి, నిరాయుధులుగా ఉన్న వారిని అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తూ, మరికొందరిని కూడా ఇలాగే హత్య చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుబడిన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని, ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు, విజయవాడ న్యూ ఆటోనగర్లో 27 మంది మావోయిస్టు పార్టీ కేడర్ను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) వర్గాలు తెలిపాయి. వీరిలో 9 మంది మావోయిస్టు అగ్రనేత దేవ్ జీకి రక్షణ గార్డులుగా ఉన్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ధృవీకరించినట్లు సమాచారం. మిగిలిన వారంతా పార్టీ కేడర్కు చెందినవారేనని, వీరంతా గెరిల్లా ఆర్మీకి చెందినవారు కావడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి.
దండకారణ్యంలో కేంద్ర బలగాల ఒత్తిడి పెరగడంతో, మావోయిస్టు నేతలు తమ కార్యకలాపాలను ఏపీలో విస్తరింపజేసేందుకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పార్టీపై నిర్బంధం పెరిగిన నేపథ్యంలో, తమ ఉనికిని నిరూపించుకునేందుకు అగ్ర నేతలను టార్గెట్ చేసేందుకు వీరు రెక్కీ నిర్వహించి ఉండవచ్చని SIB అనుమానిస్తోంది. ఈ అరెస్టులతో ఏపీలో అగ్ర నేతలను మట్టుబెట్టేందుకు వచ్చిన వారి కుట్రను భగ్నం చేశామని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?