Kollu Ravindra: బందరు పోర్టును అమ్మేసిన వ్యక్తి ఒకరు, దొంగ సారా అమ్మి అడ్డంగా దొరికిపోయింది మరొకరు అంటూ వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శలు చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో దొంగ పట్టాలు ఇచ్చి రెవెన్యూ అధికారులను రోడ్డుపై నిలబెట్టింది పేర్ని నాని కాదా? అని మండిపడ్డారు. పేర్ని నానికి సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని ఎద్దేవా చేశారు.
అవినీతి వ్యాపారంతో కట్టుకున్న భార్యనే రోడ్డున పడేసిన వ్యక్తి పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు పేరుతో రాజకీయ డ్రామాలు ఆడిన వ్యక్తి పేర్ని నాని అని ఆరోపించారు. వైసీపీ చేసిన పాపాలన్నీ కౌంట్ అయి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారన్నారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత పేర్ని నానికి లేదన్నారు. 2024 ఎన్నికల్లో తనకు డిపాజిట్లు కూడా రావని తెలిసి పోటీ చేయకుండా పారిపోయిన వ్యక్తి పేర్ని నాని అన్నారు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి జోగి రమేశ్.. సీఎం చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేశారు. ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేశ్ కు దమ్ముంటే సీఎం చంద్రబాబు ఇంటిపైకి రావాలన్నారు. ఇప్పుడేంటో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. దొంగ సారా అమ్మి అడ్డంగా దొరిరిపోయిన వ్యక్తి జోగి రమేశ్లో ఇంక కూడా ప్రాయశ్చిత్తం లేదన్నారు.
Also Read: కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 12 గంటలు నడిచే ఫోన్.. రియల్మీ కొత్త ఫోన్ గురూ
జైలు నుంచి బెయిల్పై విడుదలై.. ఇంటి వెళ్లేందుకు కార్ల పై ఎక్కి నానా హంగామా సృష్టించారన్నారు. కార్ల ర్యాలీకి అనుమతులు లేవని చెప్పినందుకు పోలీస్ అధికారికి వేలు పెట్టి బెదిరిస్తావా? అని జోగి రమేశ్ పై ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినా, ఇంకా అరాచకాలకు పాల్పడుతున్నాడని జోగి రమేశ్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.