పాలక, ప్రతిపక్షాలు తమ అవినీతికి బ్రేకులు వేస్తే.. పూర్తిగా అరికడితే తెలంగాణ ప్రజలకు ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం అందించొచ్చని టీఆరెస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాంచజన్యంలోని ఐదు పథకాల్లో కీలకమైన ఉచిత కార్పరొట్ వైద్యం, విద్య గురించి చెప్పగానే వివిధ పార్టీల నుంచి నేతలు నోరేసుకుని పడిపోతున్నారని మండిపడ్డారు.
ఓ పక్కా ప్రణాళికా, లోతైన చర్చ.. అధ్యయనం చేసిన తరువాతే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు. దీనికి ఎంత ఖర్చువుతుందో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. ఈ ఖర్చును ఎలా అధిగమించాలో, ఆ ఆదాయం ఎలా రాబట్టాలో కూడా తెలుసునని అన్నారామె. తాను అధికారంలోకి వస్తే.. ఈ అవినీతి ఉండదని, ఈ సొమ్మంతా మిగులుతుందని.. బీఆరెస్, కాంగ్రెస్ నేతలనుద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోరుట్లలో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. బీఆరెస్లో అవినీతిని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని కవిత అన్నారు. ఆ పార్టీలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీసినందుకు, విధానాలను ప్రశ్నించినందుకు బయటకు పంపించేశారని పునరుద్ఘాటించారామె. గుంటనక్కలన్నీ ఏకమై తను ఉంటే వాళ్ల ఆటలు సాగవని, అవినీతి రాజ్యం ఏలడం సాధ్యం కాదని భావించాయని, పార్టీ నుంచి గెంటేశారని గుర్తు చేశారు.
ఎప్పుడైతే అవినీతి సహా బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టానో తనపై బీఆరెస్లో కుట్రలు షురూ చేసి ఏకాకిని చేయాలనుకున్నారన్నారు. . ప్రజాసేవలో ఇన్నేండ్లుగా ఉన్న తాను ఇంకా మెరుగైన సేవలందించేందుకు సొంత పార్టీ పెట్టానని, మేధావుల ఆలోచనలన్నీ ప్రోదీ చేసుకుని .. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగేవిధంగా పాంచజన్యం అనే ఐదు పథకాలను రూపుకల్పన చేసినట్టు చెప్పారు.
ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, యువజనులకు ఆర్థిక స్వావలంభనకు, ఉపాధి అవకాశాలకు రుణాలిచ్చి చేయూతనందిస్తానని అన్నారు. యువతకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని, ఎలాంటి గ్యారంటీ లేకుండా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు వారికి రుణాలు ఇస్తామన్నారు కవిత.
ఒక గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ లాంటి సంస్థలు స్థాపించేలా ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యమంత్రికి నీళ్ల సోయి లేదని ఆమె విమర్శించారు. సీఎంను నిందిస్తూ ఇటీవలే ఒక రైతు సూసైడ్ చేసుకున్నాడని, రేవంత్ రెడ్డి మాటలకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన గుర్తు చేశారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా మనం నీళ్లను ఎత్తిపోసుకోవచ్చన్నారు.
కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల కారణంగా భద్రాచలం మునిగిపోతుందని సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడరని ఎద్దేవా చేశారు కవిత. ఈ ప్రభుత్వంలో ఏదీ అడిగినా ఎగ్గొట్టటం, ఎదురుదాడి చేయటమే ఉందని, కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే టీఆర్ఎస్ ను ఆశీర్వదించండని ఆమె కోరారు.