Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
జగన్ డైరెక్షన్లోనే కొత్త డ్రామాలు
గత ప్రభుత్వ హయాంలో అమరావతిని, సీఆర్డీఏను (CRDA) పూర్తిగా నిర్వీర్యం చేసి, రద్దు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. అప్పట్లో రాజధానిని ముక్కలు చేసి, రైతులను రోడ్డున పడేసిన వారే.. ఇప్పుడు మళ్లీ సీఆర్డీఏ పరిరక్షణ అంటూ కొత్త రాగాలు అందుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా జగన్ రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న హైడ్రామా అని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయాక మరోలా మాట్లాడటం వైసీపీ నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు
వైసీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు సమాజంలో లేనిపోని గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కేవలం ఉనికి చాటుకోవడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Also Read: బీహార్ మైండ్సెట్తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్
పద్ధతి మార్చుకోకపోతే తరిమికొడతారు
వైసీపీ నేతలు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని, ఇష్టారాజ్యంగా వాగితే ప్రజల నుంచి చెప్పు దెబ్బలు తప్పవని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇప్పటికే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా అబద్ధపు ప్రచారాలు ఆపి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హితవు పలికారు.