Telugu Academy: తెలుగు భాష, సాహిత్య వికాసానికి, విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు అందించడానికి ఏర్పాటైన తెలుగు అకాడమీని కూటమి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టించిందని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అకాడమీని ఎలా బలోపేతం చేశామో వివరిస్తూనే, ప్రస్తుత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక జరుగుతున్న అక్రమాలను పూర్తి సమాచారంతో ఎండగట్టారు.
వైయస్సార్సీపీ హయాంలో అకాడమీ పునరుద్ధరణ
2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, ఏపీ ఆస్తులను తెలంగాణకు వదిలేసి వచ్చారని లక్ష్మీపార్వతి విమర్శించారు. పదో షెడ్యూల్లో ఉన్న తెలుగు అకాడమీని కూడా ఆయన పట్టించుకోలేదన్నారు. అయితే, 2019లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తెలుగు అకాడమీని ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించి, తనను చైర్పర్సన్గా నియమించారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆస్తుల కోసం తెలంగాణతో న్యాయపోరాటం చేసి, ఏపీకి దక్కాల్సిన రూ.150 కోట్ల నిధులను సాధించామని, తిరుపతి ప్రధాన కేంద్రంగా ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా అకాడమీని నడిపించామని తెలిపారు. ఎంతో తక్కువ ధరకే పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు సకాలంలో అందించామని, సంస్థ మూలధనాన్ని పెంచామని వివరించారు.
Also Read: ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? – ఎంపీ బైరెడ్డి శబరి
కూటమి పాలనలో టెండర్ల అక్రమాలు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక తెలుగు అకాడమీని లూఠీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నాడు అకాడమీలో ఉన్న పారదర్శకత నేడు లోపించిందన్నారు. గతంలో అర్హత లేక వైయస్సార్సీపీ హయాంలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన ‘వీజీఎస్’, ‘విక్రం’ అనే సంస్థలు.. ఇప్పుడు లోకేష్తో కుమ్మక్కై నిబంధనలు మార్పించుకుని మరీ టెండర్లు దక్కించుకున్నాయని మండిపడ్డారు. నేరారోపణలు ఉన్న సంస్థలను దూరం పెట్టాల్సింది పోయి, వారికే టెండర్లు కట్టబెట్టడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు.
అకాడమీ ఆస్తుల కాజేత – సిలబస్ విక్రయం
ఈ అక్రమ సంస్థలు ఏకంగా తెలుగు అకాడమీ సిలబస్ పీడీఎఫ్(PDF)లను నేరుగా ప్రైవేట్ కాలేజీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయని లక్ష్మీపార్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చైర్మన్, డైరెక్టర్, ఇతర అధికారులు కలిసి అకాడమీ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ లూఠీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అకాడమీకి రూ.50 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సంస్థ ఆస్తులను కాజేస్తున్నారని లక్ష్మీపార్వతి తీవ్రంగా ఆరోపించారు.