YSRCP Rachamallu: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల వేట కోసమే చంద్రబాబు సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. మహావిష్ణువు లోక కల్యాణం కోసం పది అవతారాలు ఎత్తితే, చంద్రబాబు మాత్రం ప్రజలను మోసగించడానికి రెండేళ్లలోనే వందల అవతారాలు ఎత్తారని ఎద్దేవా చేశారు.
అవతారాల వెనుక అసలు రంగు!
గతంలో దళితులను చిన్నచూపు చూస్తూ, కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు, ఓట్లు గుర్తొచ్చేసరికి దళిత ప్రేమికుడిగా నటిస్తున్నారని రాచమల్లు విమర్శించారు. ఓట్ల కోసం చెప్పులు కుట్టే వారి వద్దకు వెళ్లి కూర్చోవడం, రకరకాల వేషాలు వేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టం చేశారు. బాబు వేస్తున్న ఈ ‘అవతారాల’ వెనుక ఉన్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతంలో దళిత వర్గాలపై జరిగిన దాడులు, అవమానాలను ఎవరూ మర్చిపోలేదని ఆయన గుర్తుచేశారు.
పెన్షన్ల ఊసే లేదు.. వృద్ధుల ఆవేదన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 25 నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదని రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరంతర ప్రక్రియగా పెన్షన్లు అందేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో వృద్ధులకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కొత్త పెన్షన్ల కోసం వేలాది మంది వృద్ధులు, అవ్వాతాతలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
బాబు మార్క్ మోసపూరిత రాజకీయాలు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, ఇతర వాగ్దానాలను తుంగలో తొక్కారని రాచమల్లు దుయ్యబట్టారు. కేవలం కాలయాపన చేస్తూ, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలు త్వరలోనే ఈ మోసపూరిత రాజకీయాలకు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు తగిన బుద్ధి చెబుతారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
'ఓట్ల కోసమే వందల అవతారాలు'
మహావిష్ణువు లోక కల్యాణం కోసం 10 అవతారాలు ఎత్తితే, చంద్రబాబు ప్రజలను మోసగించడానికి రెండేళ్లలోనే వందల అవతారాలు ఎత్తారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. దళితులను గతంలో కించపరిచిన బాబు, ఇప్పుడు ఓట్ల కోసం చెప్పులు… pic.twitter.com/cuddJf3y6Z
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2026