Byreddy Shabari: రాయలసీమ అభివృద్ధి, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సీమకు చేసిందేమీ లేదని, కేవలం మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని తన ఖాతాలో వేసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
జగన్ పొలిటికల్ క్రెడిట్ పాలిటిక్స్
రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్కు, ఐదేళ్ల కాలంలో ఆ ప్రాంతానికి తానేం చేశాడో చెప్పుకునే ధైర్యం లేదని బైరెడ్డి శబరి విమర్శించారు. ‘గూగుల్ గొప్ప నాదే, భోగాపురం నవ భోగాలు నావే, వెలిగొండ వెలుగులు నావే’ అంటూ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తనదేనని చెప్పుకుంటూ, జగన్ కేవలం రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకు మధ్య ఉన్న తేడాను కూడా జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
Also Read: పవన్పై అనుచిత కామెంట్స్.. విచారణకు వెళ్తూ దువ్వాడ మిస్సింగ్.. అసలేం జరుగుతోంది!
కడప స్టీల్ ప్లాంట్ – నాడు శంకుస్థాపన, నేడు అడుగులు
కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది రాయలసీమ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. జగన్ తన హయాంలో ఈ ప్లాంట్ కోసం రెండు సార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప, కనీసం ప్రహారీ గోడ కూడా నిర్మించలేకపోయారని దుయ్యబట్టారు. కాగా, ఈ ప్లాంట్ నిర్మాణానికి మొట్టమొదటిసారిగా 2018 డిసెంబర్ 27న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం రూ. 16,500 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. జూలై 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
గడిచిన రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఏకంగా 800 కంపెనీలు వచ్చాయని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో ఏకంగా 25 శాతం పెట్టుబడులు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా దూసుకుపోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read: యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. తిరుమల మోడల్ అనుసరించాలని ఆదేశం!