Pidugu Hariprasad: మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వైసీపీ పార్టీ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఆయన ఎండగట్టారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ పదవీ బాధ్యతల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కావాలనే వివాదాల్లోకి లాగుతున్నారని పిడుగు హరిప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, సంబంధం లేని విషయాలను కూడా పవన్ కళ్యాణ్కు అంటగట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, ఇలాంటి కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read: అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!
కాపులను దూరం చేయడమే వైసీపీ స్ట్రాటజీ
జనసేన పార్టీ నుంచి కాపు సామాజికవర్గాన్ని దూరం చేయడమే వైసీపీ ప్రధాన వ్యూహమని హరిప్రసాద్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నాయకులు.. కాపులను పార్టీకి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. అయితే, రాష్ట్రంలో ఉన్న కాపులంతా అమాయకులేం కాదని, వైసీపీ వేస్తున్న ప్రతి పన్నాగం ఇప్పటికే పూర్తిగా విఫలమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జులై 5 లోగా దరఖాస్తుల స్వీకరణ
పార్టీ బలోపేతంలో భాగంగా వివిధ విభాగాల్లో పదవులు ఆశించే నాయకుల నుంచి హరిప్రసాద్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. కేవలం సమర్థత, నిబద్ధత గల నాయకులను మాత్రమే పార్టీ పదవులకు ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పదవులు ఆశించే వారంతా జులై 5వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.