Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో రద్దయింది. గత కొన్ని రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని వానల కారణంగా సభా ప్రాంగణమంతా పూర్తిగా జలమయమై, బురదగా మారింది. దీంతో అక్కడ సభ నిర్వహణ సాధ్యం కాదని భావించిన యంత్రాంగం, భద్రతా కారణాల దృష్ట్యా ఖమ్మం పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసింది.
ఖమ్మం నుంచి హైదరాబాద్కు..
రైతులకు లబ్ధి చేకూర్చే ఈ కీలక కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లాల పర్యటన రద్దయినప్పటికీ, నిధుల విడుదలలో ఆలస్యం కాకూడదని భావించిన ప్రభుత్వం.. ఈ వేడుకను రాజధాని హైదరాబాద్కు షిఫ్ట్ చేసింది. నగరం నడిబొడ్డున ఉన్న శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ సభను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి అధికారికంగా నిధులను విడుదల చేయనున్నారు.
‘రైతు భరోసా’గా నామకరణం.. సరికొత్తగా పంపిణీ సదస్సు
మధిరలో ‘రైతు ఆశీర్వాద సభ’గా జరగాల్సిన ఈ ప్రోగ్రామ్ను హైదరాబాద్కు మార్చిన నేపథ్యంలో, దీనిని మరింత అధికారికంగా ‘రైతు భరోసా పంపిణీ సదస్సు’గా వ్యవహరించనున్నారు. అన్నదాతల అకౌంట్లలోకి నేరుగా పెట్టుబడి సాయం జమ చేసేందుకు ఈ వేదిక వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అత్యంత వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డిజిటల్ స్క్రీన్లపై లైవ్.. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ సందడి!
సభ హైదరాబాద్లో జరుగుతున్నప్పటికీ, రాష్ట్రంలోని మారుమూల గ్రామాల రైతులకు సైతం ఇది చేరవయ్యేలా సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. జిల్లాల్లోని అన్ని ‘రైతు వేదికల’ ద్వారా ఈ సదస్సును డిజిటల్, వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్) చేయనున్నారు. దీంతో రైతులు తమ సొంత ప్రాంతాల్లోనే ఉండి సీఎం ప్రసంగాన్ని, నిధుల విడుదల ప్రక్రియను వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, టెక్నాలజీ సాయంతో రైతాంగానికి పూర్తి భరోసా కల్పించేందుకు సర్కారు సిద్ధమైంది.