Gnaneswari Missing Case: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? పోలీసులు ఎలాంటి వివరాలు సేకరించారు? చిన్నారి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఈ కేసు వ్యవహారం ఇప్పుడు కియా కారు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? చిన్నారికి-కియా కారుకు ఏంటి సంబంధం, ఇంకా డీటేల్స్లోకి వెళ్తే..
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది చిన్నారి. ఈ కేసులో ఓ అనుమానాస్పద కారుపై పోలీసులు ఫోకస్ చేశారు. దీంతో ఈ కేసును ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గణేశ్-భవాని దంపతుల కూతురు రెండేళ్ల జ్ఞానేశ్వరి. జూన్ 6న ఈ దంపతులు పని చేస్తున్న పామాయిల్ తోటలో ఆడుకుంటుండగా చిన్నారి అదృశ్యమైంది. ఆనాటి నుంచి చిన్నారి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ప్రకటనలు ఇచ్చారు. పాప ఆచూకీ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటన చేశారు.
కియా కారు చుట్టూ కొత్త మలుపు: ఓ వైపు విచారణ జరుగుతుండగా చిన్నారి అదృశ్యమైన రోజు.. ఆ ప్రాంతంలో ఓ కియా కారు అనుమానాస్పదంగా కనిపించడం ఈ కేసులో మరో కోణం బయటపడింది. రెండు రోజులుగా పరిసర ప్రాంతాల్లో ఆ కారు తిరుగుతుండటంతో కుటుంబసభ్యుల్లో అనుమానం మొదలైంది.
చిన్నారి మిస్సింగ్ ముందు రోజు నర్సీపట్నం సమీపంలో తమ బంధువుల్లో ఒకరిని ఆ కారు ఢీ కొట్టిందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. దీంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, అటు వైపు నుంచి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!
దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు: కేవలం ప్రమాదమా? కావాలనే ఎవరైనా చేశారా? ఆ కారు నంబర్ ఆధారంగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది? కొన్ని రోజులుగా ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది? సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఈ కారు మిస్టరీ వీడితే చిన్నారి అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లభించడం ఖాయమని అంటున్నారు.