Jupally Tourism: రాజకీయాల్లో ఏదీ ఊరికే జరగదు… ప్రతిదానికీ ఒక లెక్క, ఒక టైమింగ్ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ ఇలాంటి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అటు సచివాలయంలో, ఇటు సోషల్ మీడియాలో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఏమిటంటే… “మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారా?” అని. పర్యాటక శాఖా మంత్రిగా ఉన్న జూపల్లికి కనీస సమాచారం కూడా లేకుండా, ఆ శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
బాస్ పిలవలేదు.. మంత్రిగారు ఈత కొట్టారు!
సాధారణంగా ఏ శాఖ మీదనైనా సమీక్ష జరగాలంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కుర్చీ సీఎం పక్కనే ఉండాలి. కానీ సోమవారం నాడు జరిగిన టూరిజం శాఖ రివ్యూ మీటింగ్లో సీన్ రివర్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యాటక రంగంపై గంభీరంగా చర్చిస్తుంటే, సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మాత్రం ఆ సమాచారమే లేదట. ఒకవైపు హైదరాబాద్లో అధికారులు ఫైళ్లతో సీఎం ముందు హాజరైతే, అదే సమయంలో మంత్రిగారు తన సొంత నియోజకవర్గంలో చాలా సరదాగా ఈతకొడుతూ కనిపించడం గమనార్హం. “బాస్ పిలవలేదు.. అందుకే నేనిలా రిలాక్స్ అవుతున్నా” అన్నట్టుగా సాగింది మంత్రిగారి వ్యవహారం.
సబ్జెక్ట్ లేని సవాల్.. సర్కార్కు సెగ!
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంత సడన్గా మంత్రిని పక్కన పెట్టడానికి వెనుక పెద్ద కథే ఉందని టాక్. ఇటీవల మంత్రి జూపల్లి తనకు సంబంధం లేని ఆర్థిక విషయాల్లో దూరి, గత ప్రభుత్వ అప్పులపై జబ్బలు చరిచారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తీరా మాజీ మంత్రి హరీశ్ రావు పక్కా ఆధారాలతో, లెక్కలతో కౌంటర్ ఇచ్చేసరికి జూపల్లి గారు డిఫెన్స్లో పడిపోయారు. విషయం లేకుండా సవాల్ విసిరి, పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారనే కోపం సీఎం రేవంత్ రెడ్డికి గట్టిగానే వచ్చినట్టు సమాచారం. ఈ “సెల్ఫ్ గోల్” వ్యవహారంతోనే సీఎం ఆయనపై సీరియస్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెనకాలే వెళ్లి ఆరా.. ఏం జరిగిందో ఏంటో?
తన శాఖపై తనకే తెలియకుండా రివ్యూ జరిగిపోవడంతో మంత్రి జూపల్లి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. సీఎం మీటింగ్ ముగియగానే, లోపల ఏం జరిగింది? సీఎం గారు ఏమేం ఆదేశాలు ఇచ్చారు? అని అధికారులకు ఫోన్ చేసి జూపల్లి ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. “మీటింగ్కు ఎలాగూ పిలవలేదు.. కనీసం ఆ నిర్ణయాలను అమలు చేసేటప్పుడైనా నన్ను నమ్ముతారా? లేక అప్పుడు కూడా పక్కన పెట్టేస్తారా?” అని మంత్రిగారు అధికారుల దగ్గర వాపోయినట్లు సమాచారం.
ఒంటరి పోరులో మంత్రులు..
కేవలం జూపల్లి మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది కీలక మంత్రులకు సమాచారం లేకుండానే వారి శాఖలపై సీఎం సమీక్షలు నిర్వహించారనే టాక్ ఉంది. తమకు తెలియకుండానే నియామకాలు జరిగిపోతున్నాయని, కనీస ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు మంత్రులు లోలోపల రగిలిపోతున్నారట. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో క్యాబినెట్ లోపల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ “కరివేపాకు” కథకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
Also Read: శ్రీవారి చెంతకు కానుకల వెల్లువ.. టీటీడీ ట్రస్టులకు రూ.41 లక్షల విరాళాలు.. ఆ దాతలు ఎవరంటే?