YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పోలీస్ వ్యవస్థ తీరు అత్యంత ప్రమాదకరంగా మారిందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను ఒక ఆయుధంగా వాడుకుంటోందని, రాష్ట్రంలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు, పాలకుల కక్షసాధింపు చర్యలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
వైఫల్యాలు.. నిర్లక్ష్యం
రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని జగన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మిస్సింగ్ చిన్నారి కేసులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. మహిళలపై దాడులు, నేరాలు జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులు.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వచ్చే పోస్టులపై మాత్రం అత్యంత వేగంగా స్పందిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్లో ‘సర్’ అస్తవ్యస్తం.. పది రోజులు గడిచినా అందని ఓటరు ఫారాలు!
రాజకీయ కక్షసాధింపు
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఆరోపించారు. యూట్యూబర్ కేవీఆర్ అరెస్ట్ పూర్తిగా చట్టవిరుద్ధమని, అలాగే రావణ్పై వరుసగా పెడుతున్న కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రౌడీ పోలీస్ రాజ్యాన్ని పక్కనబెట్టి, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.