Bhimavaram: భీమవరంలో టెక్కీ హత్య వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటోడ్రైవర్తో పరిచయం ఆమె ఊపిరి తీసింది. టెక్కీ దూరం పెట్టిందనే ఒక్క కారణంతో తట్టుకోలేకపోయాడు. ఫలితంగా కత్తితో ఆమెని పొడిచి తన పగ తీర్చుకున్నాడు. అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకాస్త లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి 32 ఏళ్ల అనంతవాణి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తోంది. అనారోగ్యానికి గురైన తల్లిని దగ్గరుండి చూసుకునేందుకు ఏడాది కిందట తన గ్రామానికి వచ్చింది. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోంది ఆ యువతి.
భీమవరంలో టెక్కీ దారుణహత్య: ఈ క్రమంలో తాడేరు గ్రామానికి పొరుగునున్న కొర్రపాడు ప్రాంతానికి చెంది ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్బాబుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. శ్యామ్బాబుకు వివాహం జరిగింది.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య దుబాయ్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే శ్యామ్బాబుకు కాస్త దూరంగా ఉండడం మొదలుపెట్టింది అనంతవాణి.
మొదట్లో పెద్దగా పట్టించుకోని శ్యామ్బాబు, వాణి దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించాడు. పగతో రగిలిపోతున్న శ్యామ్బాబు ఆదివారం ఉదయం అనంతవాణి ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన వెంటనే పదునైన కత్తితో టెక్కీపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఆటోడ్రైవర్తో పరిచయం ఆమె ప్రాణం తీసింది: తీవ్ర రక్తస్రావమైన వాణిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటన తర్వాత అక్కడి నుంచి ఆటోడ్రైవర్ పరారయ్యాడు. వాణి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: ‘హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’.. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు!
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. విద్యావంతురాలైన వాణి, కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచిన సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.