Annavaram Prasadam: అన్నవరంలో అపచారం జరిగింది. భక్తులకు విక్రయించే ప్రసాదం బుట్టలో ఎలుకలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ప్రసాదాలు పంపిణీ చేసే బుట్టల్లో ఎలుకలు తిరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొందరు భక్తులు ఎలుకలు ప్రసాదం బుట్టల్లో తిరుగుతున్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రసాదం బుట్టలపై ఎలుకలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు త్రిమూర్తులు, రాజులపై ఆలయ ఈవో త్రినాథరావు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రసాదం కౌంటర్ లోకి ఎలుకలు చొరబడకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే కౌంటర్పై నుంచి ఎలుకలు రాకుండా సీలింగ్ నిర్మించాలని నిర్ణయించారు.
అన్నవరంలో భక్తులకు విక్రయించే ప్రసాదాల విషయమై ఇటీవల సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రసాదాలు విక్రయించే బుట్టల్లో ఎలుకలు యథేచ్చగా తిరుగుతుండడం భక్తులు గమనించారు. ఈ విషయంపై ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా.. వాళ్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇటీవల కొందరు భక్తులు అన్నవరం హైవేపై సత్యనారాయణ స్వామి ఆలయం ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు ఆగగా.. ప్రసాదం బుట్టల్లో ఎలుకలు కనిపించాయి. ఈ విషయమై ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కడంతో.. ఇద్దరు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు.