AP Rains: మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ.. అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో.. రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని IMD చెబుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చిరించారు..
మూసీకి కొనసాగుతున్న వరద..
హైదరాబాదులో కురిసిన వర్షానికి మూసీ నదికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 643 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 11 వేల 392 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 7 వేల 918 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 3.94 టీఎంసీలు వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టు 4 గేట్లను 3అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 204 టీఎంసీలు..
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 204.79 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఎంత వరద వస్తుందో.. అంతే వరదను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులకు చేరుకుంది.
నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 298.88 TMCలు..
అంతేకాకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 లక్షల 46వేల 471 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 5లక్షల 86వేల 541 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 298.88 టీఎంసీలుగా ఉండగా.. నీటి మట్టం 585 అడుగులకు చేరింది.
Also Read: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక..
ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 6 లక్షల 86వేల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్లోకి ఎంత వరద వస్తుందో.. అంతే వరదకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెనాల్స్కు 11వేల 148 క్యూసెక్కులు వెళ్తోంది. వరద ఉధృతి కారణంగా నదీ పరివాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఘాట్లలో స్నానాలు నిలిపివేశారు. నదిలోకి భక్తులు దిగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. NDRF, SDRF సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.