Amaravati: ఏపీని రోజుకో అంశం కుదిపేస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు జోరుగా చేస్తోంది సిట్. ఇదే సమయంలో ప్రశ్న రావణ్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో అరెస్ట్ చేయడం మద్దతుదారులకు మింగుడు పడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రశ్నరావణ్ నేరుగా ఏపీ హైకోర్టు తలుపు తట్టాడు. అసలేం జరిగింది?
యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వరుస అరెస్టులను ఎదుర్కొంటున్నాడు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. తాజాగా ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించాడు.
ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ- CBIతో విచారణ జరిపించాలని అందులో ప్రస్తావించాడు. రావణ్ వేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. రావణ్ తన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. అంతేకాదు ఆయనపై పాయకరావుపేట, పిఠాపురం,మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్లను ప్రతివాదులుగా పేర్కొన్నట్లు సమాచారం.
ఏపీ హైకోర్టులో పిటిషన్.. అన్నింటిని ఒకే కేసు కింద విచారించాలని పిటిషన్
ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. రావణ్పై గన్నవరం పీఎస్లో ఫిర్యాదు చేశారు జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. ఆయన ఫిర్యాదుతో రావణ్ పై U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 (UAPA Act) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ: తెలంగాణలోని లేని అందాలు ఏపీలో ఉన్నాయి.. చిత్ర పరిశ్రమకు మంత్రి దుర్గేశ్ బంపరాఫర్
కస్టడీలో ఆహారం మానేసి నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రశ్న రావణ్. సాయికృష్ణ మాదిరిగా కస్టడీలో చంపాలనుకుంటే దీక్షలో ప్రాణాలు వదులుతానని ప్రస్తావించాడు. తనను చంపగలరు కానీ.. ప్రశ్నలను చంపలేరని, తాను చనిపోయినా ప్రశ్నలు వస్తూనే ఉంటాయన్నాయని హెచ్చరించిన విషయం తెల్సిందే.