Thumukunta SBI Robbery: హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో జరిగిన సంచలన ఎస్బీఐ బ్యాంక్ దోపిడీ కేసును రూరల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో కీలకమైన మరో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
గత ఏడాది జులై 27న తూముకుంటలోని ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడిన దుండగులు, గ్యాస్ కట్టర్ల సహాయంతో లాకర్లను పగులగొట్టి ఏకంగా 11 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా గత ఆగస్టులోనే హర్యానాకు చెందిన అనిల్ పన్వర్ అనే దొంగను అరెస్టు చేసి, అతని నుంచి రూ. 3.50 కోట్ల విలువైన బంగారం, ఒక కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తుండగా, తాజాగా రాజస్థాన్కు చెందిన ఇష్ రార్ ఖాన్ అనే దొంగను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి సుమారు రూ. 5 కోట్ల 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక కారు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
నిందితులు ఇద్దరూ జల్సాలకు, వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం దేశవ్యాప్తంగా బ్యాంక్ దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిపై వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 14 దోపిడీ కేసులు ఉన్నాయి. తూముకుంటలో దోపిడీ చేసిన తర్వాత కూడా వీరు మరికొన్ని చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. మిగిలిన బంగారాన్ని కూడా రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also: దారుణం.. కూతురిని ప్రేమించాడని స్తంభానికి కట్టేసి.. కొట్టి.. ఆ తర్వాత