Skydiving accident: అమెరికాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో తెలుగు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి మణిచంద్ర తేజ (28) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీకెండ్ సరదా కోసం వెళ్లిన స్కైడైవింగ్ అతనికి నూరేళ్ల ఆయుష్షును దూరం చేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, కెరీర్లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న తరుణంలో ఈ ఘోర ప్రమాదం జరగడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సరదా కోసం వెళ్తే.. ఊహించని విషాదం!
వివరాల్లోకి వెళ్తే.. మణిచంద్ర తేజ ఈ నెల 12వ తేదీన మసాచుసెట్స్లోని ఆరంజ్ పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ స్కైడైవింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆకాశంలో విహరిస్తూ స్కైడైవింగ్ అనుభూతిని ఆస్వాదించాలని భావించాడు. శిక్షణ ప్రకారం అంతా సజావుగానే సాగింది. విమానం నుంచి దూకిన తర్వాత ఆకాశంలో చక్కగా విహరించాడు. అయితే, ల్యాండింగ్ సమయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. భూమికి మరికొద్ది దూరంలో ఉన్నాడనగా వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి.
నియంత్రణ కోల్పోయిన పారాచూట్
మణిచంద్ర కిందకు దిగుతున్న తరుణంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచాయి. దీంతో పారాచూట్పై అతను నియంత్రణ కోల్పోయాడు. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండగా గాలి వేగానికి పారాచూట్ అటుఇటు ఊగిసలాడి, ఒక్కసారిగా మణిచంద్ర కిందకు పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కాంక్రీట్ లాంటి గట్టి ఉపరితలంపై పడటంతో అతనికి తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయి. అక్కడున్న సిబ్బంది వెంటనే స్పందించి, అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక చికిత్స పొందుతూ మణిచంద్ర కన్నుమూశాడు.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు
మణిచంద్ర తేజ అమెరికాలోని ప్రతిష్టాత్మక నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ (MS) పూర్తి చేశాడు. చదువులో ఎప్పుడూ ముందుండే అతను, ఇటీవలే ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరాడు. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు, ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడనే వార్త వినగానే స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక పూర్తిగా వాతావరణ పరిస్థితుల వల్లే జరిగిందా అనే కోణంలో అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు.. సైకిల్పై కేదార్నాథ్ చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించిన పంకజ్