Andhra Pradesh: నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమశిల ప్రాజెక్టును సందర్శించి, అక్కడ నీటి లభ్యత, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్తున్న కాకాణిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలను పక్కనపెట్టి, రైతాంగాన్ని వంచించేలా నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLS) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లా రైతాంగానికి శాపంగా మారబోతున్నాయని కాకాణి ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి, వరద నీరు వృథాగా సముద్రంలో కలవకుండా రాయలసీమతో పాటు నెల్లూరులోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు మళ్ళించేలా చేసిన కృషినే తాము కొనసాగించామని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు “చరమగీతం” పాడుతోందని, దీనివల్ల భవిష్యత్తులో సాగునీటి కోసం రైతులు అల్లాడాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మౌనం వహించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కాకాణి విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల ద్వారా నీటిని మళ్ళించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణమన్నారు. విభజన తర్వాత ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు తెలంగాణలో ఆంధ్రుల హక్కులను తాకట్టు పెట్టారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గుతున్న సమయంలో, కనీస స్థాయి కంటే తక్కువలో ఉన్నప్పుడు కూడా నీటిని తోడుకునేలా రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించడం వల్ల నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని నాయకులు పేర్కొంటున్నారు. సోమశిల జలాశయానికి ప్రధాన వనరు అయిన పెన్నా నదిలోకి కృష్ణమ్మ నీరు చేరకపోతే, జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గత ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: ఇరుసుమండలో ఆగిన మంటలు.. ఎలా అదుపులోకి తెచ్చారంటే?
ఈ నిరసనల నేపథ్యంలో నెల్లూరు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీగా మోహరించారు. నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించడంతో వైసీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. తమను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా పోరాటాన్ని ఆపలేరని, రైతుల ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని కాకాణి స్పష్టం చేశారు.
నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి ఇంటి వద్ద ఉద్రిక్తత
సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు యత్నించిన కాకాణి, వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
వైసీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం
రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి కాకాణి నిరసన pic.twitter.com/auGgb5UqGI
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2026